
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ దాదాపు ముగింపు దశకు వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో చెన్నై సూపర్ కింగ్స్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. టోర్నమెంట్ ఆరంభానికి కొద్ది రోజుల ముందు ఫ్రాంఛైజీ తీసుకున్న నిర్ణయమే ఈ జట్టు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిందనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా- ఫ్రాంఛైజీ తీసుకుంటోన్న నిర్ణయాలు ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేస్తున్నాయి. ఫ్రాంఛైజీ వ్యవహారశైలి ఇప్పుడు విమర్శకుల నోటికి పని చెప్పినట్టయింది.
ప్రారంభంలో చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా కేప్టెన్సీలో కొన్ని మ్యాచ్లను ఆడిన విషయం తెలిసిందే. టోర్నమెంట్ ప్రారంభం కావడానికి కొద్దిరోజుల ముందు మహేంద్ర సింగ్ ధోనీకి బదులుగా రవీంద్ర జడేజకు కేప్టెన్సీ పగ్గాలను ఇవ్వడం.. జట్టు పరాజయాలకు బీజం వేసిందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ మార్పు వల్ల సంభవించిన దుష్పరిణామాలు జట్టును ప్రభావితం చేశాయని, రాత్రికి రాత్రి కేప్టెన్సీ మార్పు వల్ల ప్రతికూల ప్రభావమే అధికంగా ఉందని అంటున్నారు అభిమానులు.

గాయం కారణంగా రవీంద్ర జడేజ- ఈ టోర్నీ నుంచి తప్పుకోవడం మరింత విమర్శలకు కేంద్రబిందువైంది. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ మేనేజ్మెంట్ ఉద్దేశపూరకంగానే అతన్ని పక్కన పెట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. జడేజ నుంచి అధికారిక ప్రకటన వచ్చిన కొద్ది సేపటికే అతని అధికారిక ఇన్స్టాగ్రామ్ను చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అన్ ఫాలో చేసినట్లు వార్తలు రావడం- ఈ అనుమానాలు, ఆరోపణలకు బలాన్ని కలిగించాయి.
ఈ వ్యవహారం మొత్తంపైనా చెన్నై సూపర్ కింగ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాశీ విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలను ఆయన తప్పు పట్టారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వార్తలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జడేజ విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని, అతను మాత్రం ఎప్పటికీ తమతోనే ఉంటాడని తేల్చి చెప్పారు. తమ భవిష్యత్ ప్రణాళికల్లో రవీంద్ర జడేజ భాగస్వామ్యం ఉంటుందని అన్నారు.
ఐపీఎల్ 2023 సీజన్లో జట్టుకు అందుబాటులో ఉంటాడనే విషయాన్ని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు. రాయల్ ఛాలెంజర్స్తో జరిగిన మ్యాచ్లో జడ్డూ గాయపడ్డాడని, డాక్టర్ల సలహా మేరకు అతనికి విశ్రాంతి ఇవ్వాల్సి వచ్చిందని కాశీ విశ్వనాథన్ అన్నారు. అందువల్లే ఢిల్లీ కేపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఆడలేదని చెప్పారు. అంతవరకే గానీ- అతణ్ని ఉద్దేశపూరకంగా తప్పించామనడంలో అర్థం లేదని వివరణ ఇచ్చారు. త్వరలోనే ఆయన ఇంటికి వెళ్తారని, విశ్రాంతి అవసరమని తాము భావిస్తున్నామని స్పష్టం చేశారు.