బెంగళూరు: క్రికెట్ అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం ఘనంగా ప్రారంభమైంది. వేలంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మంచి ధర పలికాడు. 2 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్తో వేలంలోకి వచ్చిన అశ్విన్ను రాజస్థాన్ రాయల్స్ 5 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. అశ్విన్ కోసం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మినహా మిగతా జట్లు పోటీ పడలేదు.
దీంతో అశ్విన్కు మెగా వేలంలో భారీ ధర లభించలేదు. కాగా మెగా వేలంలో అశ్విన్ రెండో ప్లేయర్గా వేలం పాటలోకి వచ్చాడు. మెగా వేలం టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్తో ప్రారంభమైంది. ధావన్ను పంజాబ్ కింగ్స్ 8 కోట్ల 25 లక్షల రూపాయలకు దక్కించుకుంది.
కాగా అభిమానులంతా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున ఐపీఎల్ మెగా వేలం 2022 బెంగళూరు వేదికగా ఘనంగా ప్రారంభమైంది. వేలానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బీసీసీఐ సెక్రటరీ జైషా హాజరయ్యారు. వీరితోపాటు ఇతర బీసీసీఐ అధికారులు కూడా మెగా వేలానికి విచ్చేశారు. వేలానికి ముందు బీసీసీఐ అధికారులకు, అన్ని ఫ్రాంచైజీలకు వెల్కమ్ చెప్పారు.
ఈ సారి ఐపీఎల్లో కొత్తగా వచ్చిన అహ్మదాబాద్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అనంతరం వేలంలో ఎంత మంది ఆటగాళ్లు పాల్గొంటున్నది చెప్పారు. వేలంలో 600 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారని తెలిపారు. ఇందులో 377 మంది ఆటగాళ్లు భారత్కు చెందినవారని, 223 మంది ఆటగాళ్లు విదేశాలకు చెందిన వారు ఉన్నారని వివరించారు.