
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూశాంసన్పై ఆ జట్టు హెడ్ కోచ్, శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో సంజూ శాంసన్ అత్యుత్తమ టీ20 క్రికెటర్ అని ఆయన కొనియాడాడు. శాంసన్ అద్భుతమైన ఆటగాడన్న సంగక్కర.. అతను తన విధ్వంసకర ఆట తీరుతో మ్యాచ్ ఫలితాన్నే మార్చేయగలడని చెప్పుకొచ్చాడు. టీ20ల్లో ఒక బ్యాటర్కు ఉండాల్సిన అన్ని సామర్థ్యాలు సంజూ శాంసన్కు ఉన్నాయని సంగక్కర చెప్పాడు.
తాను గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో బాధ్యతలు చేపట్టకముందే శాంసన్ కెప్టెన్గా ఉన్నాడని తెలిపాడు. తాను రాజస్థాన్ రాయల్స్లో చేరాక సంజూ శాంసన్ గురించి మరింత ఎక్కువగా తెలుసుకున్నానని ఆయన చెప్పాడు. శాంసన్కు రాజస్థాన్ రాయల్స్ పట్ల మక్కువ ఎక్కువ అని, అతని కెరీర్ను ఇక్కడే ప్రారంభించాడని అన్నాడు.
శాంసన్ సహజ కెప్టెన్ అని కొనియాడిన సంగక్కర.. అతనిలో అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు. తెలియని విషయాలను తెలుసుకుంటాడని, శాంసన్ కచ్చితంగా మరింత మెరుగవుతాడని సంగక్కర ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 121 మ్యాచ్లాడిన శాంసన్ 29 సగటుతో 3068 పరుగులు చేశాడు.
ఇందులో 3 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోర్ 119 పరుగులుగా ఉంది. కాగా గత సీజన్లో సంజూ శాంసన్ 14 మ్యాచ్ల్లో 40 సగటుతో 136.72 స్ట్రైక్ రేట్తో 484 పరుగులు చేశాడు. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తన తొలి మ్యాచ్ను 29న సన్రైజర్స్ హైదరాబాద్తో ఆడనుంది. ఐపీఎల్లో ఇప్పటివరకు ఒక్క సారే ట్రోఫీ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మరో సారి టైటిల్ను ముద్దాడాలని పట్టుదలగా ఉంది.
రాజస్థాన్ రాయల్స్ పూర్తి జట్టు
సంజూ శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, రియాన్ పరాగ్, కెసి కరియప్ప, ఒబెద్ సైని, నవ్దీప్ సైని సింగ్, కుల్దీప్ సేన్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్, తేజస్ బరోకా, కుల్దీప్ యాదవ్, శుభమ్ గర్వాల్, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, డారిల్ మిచెల్.