

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో మొన్నటివరకు వరుస విజయాలను సాధించిన జట్టు.. రాజస్థాన్ రాయల్స్. తొలి రెండు మ్యాచ్లల్లో భారీ విజయాలను సాధించిన జట్టు అది. తాజాగా ముంబై వాంఖెడె స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఓడినప్పటికీ.. టఫ్ ఫైట్ ఇచ్చింది. 87 పరుగులకే రాయల్ ఛాలెంజర్స్ అయిదు వికెట్లను కుప్పకూల్చింది. మిడిల్ ఆర్డర్లో వికెట్ కీపర్ దినేష్ కార్తీక్-షాబాజ్ అహ్మద్ భారీ పార్ట్నర్షిప్ అడ్డుగా లేకపోయి ఉంటే- హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసి ఉండేదే.
దూకుడు మీదున్న రాజస్థాన్ రాయల్స్కు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. ఆల్రౌండర్ నాథన్ కౌల్టర్ నీల్ జట్టుకు దూరం కానున్నాడు. సిరీస్ మొత్తానికీ అతను అందుబాటులో ఉండట్లేదు. ఈ విషయాన్ని జట్టు మేనేజ్మెంట్ కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. మిగిలిన మ్యాచ్లకు దూరమైనట్లు తెలిపింది. దీనిపై ఓ వీడియోను తన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్పై పోస్ట్ చేసింది. స్పీడీ రికవరీ అనే క్యాప్షన్ను దీనికి జత చేసింది.
రాజస్థాన్ రాయల్స్ తరఫున సన్రైజర్స్ హైదరాబాద్పై నాథన్ కౌల్టర్ నీల్ తొలి మ్యాచ్ ఆడాడు. మూడు ఓవర్లు మాత్రమే వేయగలిగాడు. ఆ తరువాత గాయం వల్ల జట్టుకు దూరం అయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్కే పరిమితం అయ్యాడు. ఆ తరువాత ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రాజస్థాన్ ఆడిన రెండు మ్యాచ్లల్లో కౌల్టర్ నీల్ ఆడలేదు. అతని స్థానాన్ని మరో ఫాస్ట్ బౌలర్ నవ్దీప్ సైనీ భర్తీ చేశాడు.
గాయం నుంచి కోలుకుని, పూర్తి ఫిట్నెస్ సాధించడానికి కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుందని తేలడంతో- ఇక అతను స్వదేశానికి తిరుగుముఖం పట్టనున్నాడు. కౌల్టర్ నీల్ స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న నవ్దీప్ సైనీ రాణించాడు. ముంబై ఇండియన్స్పై మూడు ఓవర్లు వేసి 36 పరుగులు ఇచ్చాడు. రెండు వికెట్లు పడగొట్టాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపైనా మూడు ఓవర్లల్లో 36 పరుగులు ఇచ్చి, ఒక వికెట్ తీసుకున్నాడు.