
బెంగళూరు: అండర్ 19 ప్రపంచకప్లో బ్యాట్, బాల్తో అదరగొట్టిన టీమిండియా యువ ఆల్రౌండర్ రాజ్ అంగద్ బవాపై ఐపీఎల్ 2022 మెగా వేలంలో కోట్ల వర్షం కురిసింది. 19 ఏళ్ల ఈ యువ ఆల్రౌండర్ను 2 కోట్ల రూపాయలకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. 20 లక్షల రూపాయల బేస్ ప్రైజ్తో మెగా వేలంలోకి వచ్చిన రాజ్ బవా కోసం ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ పోటీ పడ్డాయి. అయితే చివరకు 2 కోట్ల రూపాయలకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. పేస్ ఆల్రౌండర్ అయినా రాజ్ బవా వెస్టిండీస్ వేదికగా జరిగిన అండర్ 19 ప్రపంచకప్ను టీమిండియా గెలుచుకోవడంల్ కీలక పాత్ర పోషించాడు. టోర్నీ మొత్తం బ్యాట్, బాల్తో రాణించాడు. ఇక ఆంటిగ్వా వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియాను ఒంటి చేతితో గెలిపించాడు. తన పేస్ బౌలింగ్తో ఆంగ్లేయ యువ ఆటగాళ్లను వణికించిన బవా ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్లోనూ 35 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఫైనల్ మ్యాచ్లో రాజ్ బవాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా వరించింది.
ఇక ఇతర టీమిండియా అండర్ 19 ప్రపంచకప్ ఆటగాళ్లపై కూడా మెగా వేలంలో కాసుల వర్షం కురిసింది. 20 లక్షల రూపాయల బేస్ ప్రైజ్తో వేలంలోకి వచ్చిన టీమిండియా అండర్ 19 కెప్టెన్ యష్ ధూల్ను ఢిల్లీ క్యాపిటల్స్ 50 లక్షల రూపాయలకు దక్కించుకుంది. అలాగే అండర్ 19 ప్రపంచకప్లో రాణించిన మరో టీమిండియా ఆల్రౌండర్ రాజవర్ధన్ హంగర్గేకర్ను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. వేలంలో 20 లక్షల రూపాయల బేస్ ప్రైజ్తో బరిలోకి దిగిన రాజవర్దన్ను సీఎస్కే కోటి 50 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. ఇతర ఆటగాళ్లల్లో సిమర్ జిత్ సింగ్ను కూడా చెన్నైసూపర్ కింగ్స్ 50 లక్షల రూపాయలకు దక్కించుకుంది. యష్ దయాల్ను గుజరాత్ టైటాన్స్ 3 కోట్ల 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది.