ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో రోండో క్వాలిఫయర్ వచ్చేసింది. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆడుతూ వస్తోన్న రెండు పాతజట్లు ఇవ్వాళ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. సంజు శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్-ఫాఫ్ డుప్లెసిస్ నాయకత్వాన్ని వహిస్తోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో క్వాలిఫయర్లో తలపడనున్నాయి. ఈ సాయంత్రం 7:30 గంటలకు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ ఉంటుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య కోల్కతలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఎలిమినేటర్కు వర్షం కొద్దిసేపు అడ్డుపడిన విషయం తెలిసిందే. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మ్యాచ్ ఆలస్యంగా ఆరంభమైంది. అయినప్పటికీ- మ్యాచ్ 20 ఓవర్లపాటు సాగింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ పంచింది క్రికెట్ అభిమానులకు. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్ అది. విజయం కోసం రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.
ఈ తరహా పరిస్థితులు ప్రస్తుతానికి అహ్మదాబాద్లో లేవు. వాతావరణం సాధారణంగా ఉంది. వర్షం పడే అవకాశాలు దాదాపుగా లేవు. వర్షం పడటానికి మూడు శాతం మాత్రమే ఛాన్స్ ఉందని అహ్మదాబాద్లోని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. పగటి ఉష్ణోగ్రత గరిష్ఠంగా 43 డిగ్రీల వరకు ఉండొచ్చని పేర్కొంది. సాయంత్రం తరువాత ఆకాశం పాక్షికంగా మేఘావృత్తం అవుతుందని, వర్షం పడకపోవచ్చని తేల్చి చెప్పింది.
రాత్రి ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతుందని, గాలిలో తేమశాతం కూడా సాధారణంగానే ఉంటుందని స్పష్టం చేసింది. పగటిపూట గాలిలో తేమ 51 శాతం, రాత్రివేళ 61 శాతంగా ఉంటుందని తెలిపింది. నరేంద్ర మోడీ స్టేడియం పిచ్- వన్డే, టీ20 ఇంటర్నేషనల్స్కు అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి- టీ20 స్పెషలిస్ట్ పిచ్గా దీన్ని అభివర్ణిస్తుంటారు క్రికెట్ పండింతులు. తొలి ఇన్నింగ్ బ్యాటింగ్ యావరేజ్ 174 పరుగులు కావడం దీనికి నిదర్శనం. రెండో ఇన్నింగ్ బ్యాటింగ్ యావరేజ్ 166.