ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఇవ్వాళ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు ఆరంభం కానుంది. రాజస్థాన్ రాయల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. వన్డే ఇంటర్నేషనల్స్, టీ20లకు అనుకూలంగా ఉండే పిచ్ కావడం వల్ల క్వాలిఫయర్ 1, ఎలిమినేట్ తరహాలో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తోన్నాయి.
నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ను ప్రత్యేకించి- టీ20 మ్యాచ్ల కోసం రూపొందించింది గుజరాత్ క్రికెట్ అసోసియేషన్. తొలి ఇన్నింగ్ బ్యాటింగ్ యావరేజ్ 174 పరుగులు కావడం దీనికి నిదర్శనం. రెండో ఇన్నింగ్ బ్యాటింగ్ యావరేజ్ 166. తొలిసారిగా బ్యాటింగ్ చేసిన జట్టు 200లకు పైగా స్కోర్ను సాధిస్తుందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా..క్రికెట్ ప్రేమికులకు మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ను ఇవ్వడం ఖాయం.
జోస్ బట్లర్, సంజు శాంసన్, విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, దినేష్ కార్తీక్ వంటి బ్యాటర్ల నుంచి భారీ షాట్లను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాగా- మ్యాచ్ ఆరంభానికి ముందు ఈ రెండు జట్ల మధ్య కాస్త వాతావరణం వేడెక్కింది. రాజస్థాన్ రాయల్స్ కవ్వింపు ట్వీట్లు దీనికి కారణం అయ్యాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులను రెచ్చగొట్టేలా రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ పేజ్ అడ్మిన్ ట్వీట్ చేయడం వార్కు తెర తీసింది.
Dear RCB fans,
— Rajasthan Royals (@rajasthanroyals) May 27, 2022
Love you, no matter which Royal wins tonight. ☺️
- Admin
నేరుగా రాయల్ ఛాలెంజర్స్ అభిమానులను ఉద్దేశించి చేసిన ట్వీట్ అది. డియర్ ఆర్సీబీ ఫ్యాన్స్, లవ్యూ అంటూ ట్వీట్ చేశాడు రాజస్థాన్ రాయల్స్ అడ్మిన్. గెలిచేది తామేనంటూ స్పష్టం చేశాడు. రాయల్ విన్స్ టు నైట్ అంటూ తేల్చి చెప్పాడు. ఇది కాస్తా బెంగళూరు ఫ్యాన్స్ను రెచ్చగొట్టినట్టయింది. ఈ ట్వీట్కు రిప్లైల మీద రిప్లైలు ఇస్తోన్నారు. సెటైరికల్గా తిప్పి కొడుతున్నారు. రెండో క్వాలిఫయర్లో గెలవడం మాత్రమే కాదు.. కప్ను కూడా ఎగరేసుకెళ్తామంటూ బదులిస్తోన్నారు.