ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ ప్లేఆఫ్స్కు వర్షం బెడద తప్పేట్టు లేదు. ఎల్లుండి జరిగే తొలి క్వాలిఫయర్ మ్యాచ్కు భారీ వర్షం పొంచివుంది. ఈ మ్యాచ్ వర్షార్పణం కావడానికే అధిక అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ మ్యాచ్కు ఆతిథ్యాన్ని ఇచ్చిన కోల్కతలో మంగళవారం నాడు భారీ వర్షం పడుతుందని స్పష్టం చేసింది. ఇప్పటికే కోల్కతలో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
తొలి క్వాలిఫయర్ ఈ నెల 24వ తేదీన మంగళవారం ఉంటుంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్, సంజు శాంసన్ నాయకత్వాన్ని వహిస్తోన్న రాజస్థాన్ రాయల్స్.. తొలి క్వాలిఫయర్లో తలపడతాయి. సాయంత్రం 7:30 గంటలకు కోల్కతలోని ఈడెన్ గార్డెన్స్లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. రెండో క్వాలిఫయర్లో ఆడుతుంది. అదే రోజు కోల్కతలో భారీ వర్షం పడుతుందని వాతావరణం కేంద్రం పేర్కొంది.
శుక్రవారం రాత్రి కోల్కతలో భారీ వర్షం పడింది. బలమైన ఈదురుగాలులు వీచాయి. శనివారం ఉదయం వరకూ వర్షం కురుస్తూనే ఉంది. దీనిదెబ్బకు- తొలి క్వాలిఫయర్కు ఆతిథ్యాన్ని ఇస్తోన్న ఈడెన్ గార్డెన్స్ తడిచి ముద్దయింది. ప్రెస్ బాక్స్ అద్దాలు ఊడి పడ్డాయి. ఈ బాక్స్ మొత్తం ధ్వంసమైంది. వర్షం నిలిచిన అనంతరం బీసీసీఐ ఛైర్మన్ సౌరవ్ గంగూలీ.. ఈడెన్ గార్డెన్స్ను సందర్శించారు. మరో 48 గంటల్లో క్వాలిఫయర్ 1 ఆరంభం కావాల్సి ఉన్నందున గ్రౌండ్ను సిద్ధం చేయడానికి అవసరమైన సూచనలు జారీ చేశారు.
ఈ ఐపీఎల్ సీజన్లో లీగ్ దశలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా నీళ్లపాలు కాలేదు. వర్షం వల్ల రద్దు కావడం గానీ, ఓవర్లను కుదించడం గానీ జరగలేదు. ఈ సారి మాత్రం కోల్కతకు సోమ, మంగళవారాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున దాని ప్రభావం కాస్తా క్వాలిఫయర్ 1 మీద పడుతుందనే అంచనాలు ఉన్నాయి. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్, సంజు శాంసన్ నాయకత్వాన్ని వహిస్తోన్న రాజస్థాన్ రాయల్స్.. తొలి క్వాలిఫయర్లో తలపడతాయి.