అహ్మదాబాద్: ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్ ఈ రాత్రికి ఆరంభం కాబోతోంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అంగరంగ వైభవంగా దీన్ని నిర్వహించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. సంజు శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్-హార్దిక్ పాండ్యా నాయకత్వాన్ని వహిస్తోన్న గుజరాత్ టైటాన్స్ ఇవ్వాళ ఫైనల్లో తలపడనున్నాయి. ఫైనల్స్ విజేత ఎవరనేది ఉత్కంఠభరితంగా మారింది.
కొత్త ఛాంపియన్గా గుజరాత్ ఆవిర్భవిస్తుందా? లేక.. ఐపీఎల్ తొలి సీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్ మరోసారి కప్ను లిఫ్ట్ చేస్తుందా? అనేది చర్చనీయాంశమైంది. ఈ ఫైనల్ మ్యాచ్తో పాటు మరో విన్నర్ కూడా స్పష్టమౌతుంది. అదే పర్పుల్ క్యాప్. సీజన్ మొత్తానికీ అత్యధిక వికెట్లను పడగొట్టిన బౌలర్కు లభించే ఫెలిసిటేషన్ ఇది. దీనికోసం ఇద్దరు స్పిన్ బౌలర్లు పోటీపడుతున్నారు. ఫాస్ట్ బౌలర్లు దరిదాపుల్లోనూ లేరు.
యజువేంద్ర చాహల్-వనిందు హసరంగ.. ఈ ఇద్దరి మధ్యే పర్పుల్ క్యాప్ రేసు నడుస్తోంది. చాహల్- రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. ఇవ్వాళ్టి ఫైనల్లో అతను కీలక పాత్ర పోషించడం ఖాయంగా కనిపిస్తోంది. వనిందు హసరంగకు మరో మ్యాచ్ ఆడే అవకాశం లేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ బ్యాక్బోన్ హసరంగ. రాజస్థాన్ రాయల్స్తో ఆడిన రెండో క్వాలిఫయరే ఈ సీజన్లో చివరిది.
అయినప్పటికీ.. హయ్యెస్ట్ వికెట్ టేకర్గా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు హసరంగ. లీగ్ దశలో 14, ప్లేఆఫ్స్లో రెండు మ్యాచ్లను ఆడిన హసరంగ మొత్తంగా 26 వికెట్లను నేలకూల్చాడు. 18 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు పడగొట్టడం అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్. 2021 సీజన్లో ఎంట్రీ ఇచ్చిన హసరంగ అప్పట్లో రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. వికెట్లేమీ తీసుకోలేదు. ఇప్పుడు మాత్రం ఏకంగా 26 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. పర్పుల్ వికెట్ కోసం పోటీపడుతున్నాడు.
యజువేంద్ర చాహల్ కూడా 26 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకు అతను 16 మ్యాచ్లు ఆడాడు. ఫైనల్స్ ఇంకా బాకీ ఉంది. బెస్ట్ బౌలింగ్ ఫిగర్ 5/40. వికెట్లను తీసుకోవడంలో సమానంగా నిలవడం వల్ల ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఒక్క వికెట్ తీసుకున్నా.. పర్పుల్ క్యాప్ యజువేంద్ర చాహల్ వశమౌతుంది. వికెట్లేవీ తీసుకోకుండా.. తన నాలుగు ఓవర్ల కోటాలో అయిదు కంటే ఎక్కువ పరుగులు ఇచ్చాడంటే మాత్రం పర్పుల్ క్యాప్ చేజారుతుంది. హసరంగ సొంతమౌతుంది.