
బెంగళూరు: ఐపీఎల్ మెగా వేలం తొలి రోజు పలువురు ఆటగాళ్లను కోటీశ్వరులను చేసింది. మోగా వేలంలో పలువురు యువ ఆటగాళ్లకు జాక్పాట్ తగిలిందని చెప్పుకోవాలి. ఈ క్రమంలో భారత్కు చెందిన యువ ఆటగాళ్లు షారూక్ ఖాన్, రాహుల్ తెవాటియాలకు మెగా వేలంలో అదృష్టం కలిసొచ్చింది. వీరిద్దరికి ఏకంగా 9 కోట్ల రూపాయల భారీ ధర పలికింది. ఇటీవల ముగిసిన దేశవాళ్లీ లీగ్ల్లో చెలరేగడం వీరిద్దరికీ కలిసొచ్చిందని చెప్పుకోవాలి. రాహుల్ తెవాటియాను గుజరాత్ టైటాన్స్ను 9 కోట్ల రూపాయలకు ఇతర ఫ్రాంచైజీలతో పోటీ పడి మరి దక్కించుకుంది. అలాగే షారూక్ ఖాన్ను కూడా పంజాబ్ కింగ్స్ 9 కోట్ల రూపాయల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. షారూక్ ఖాన్ కోసం పలు ప్రాంచైజీలు పోటీ పడినప్పటికీ చివరకు పంజాబే దక్కించుకుంది.
కాగా గత సీజన్లోనూ షారూక్ ఖాన్ పంజాబ్ కింగ్స్ తరఫునే ఆడాడు. ఆ సీజన్లో షారూక్కు పంజాబ్ 5 కోట్ల 25 లక్షల రూపాయలు చెల్లించింది. ఈ సారి వేలంలో అంతకన్నా 3 కోట్ల 75 లక్షల రూపాయలను ఎక్కువగా చెల్లించి కొనుగోలు చేయడం గమనార్హం. ఇక రాహుల్ తెవాటియా గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఆ సమయంలో తెవాటియాకు రాజస్థాన్ 3 కోట్ల రూపాయలు చెల్లించింది. కాగా ఈ సారి వేలంలో అంతకన్నా 6 కోట్ల రూపాయలు ఎక్కువగా చెల్లించి గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది.
వీరిద్దరే కాకుండా మరికొంత మంది యువ ఆటగాళ్లకు కూడా మెగా వేలంలో జాక్పాట్ తగిలింది. శివమ్ మావిని కోల్కతా నైట్ రైడర్స్ 7 కోట్ల 25 లక్షల రూపాయల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. అలాగే హర్పీత్ బ్రార్ను పంజాబ్ కింగ్స్ 3 కోట్ల 80 లక్షల రూపాయలకు దక్కించుకుంది. ఇక అభిషేక్ శర్మను సన్రైజర్స్ హైదరాబాద్ 6 కోట్ల 50 లక్షల రూపాయలకు దక్కించుకుంది. రాహుల్ చాహర్ను పంజాబ్ కింగ్స్ను 5 కోట్ల 25 లక్షల రూపాయలకు దక్కించుకుంది.