

మరో 3 రోజుల్లోనే క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ప్రారంభం కానుంది. జట్లన్నీ కూడా లీగ్ కోసం సిద్ధమైపోయాయి. ఈ నెల 26న డిఫెండింగ్ చాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్తో ఐపీఎల్ 15 సీజన్కు తెరలేవనుంది. ఇందు కోసం చెన్నైసూపర్ కింగ్స్ ఇప్పటికే మ్యాచ్ వేదిక ముంబై చేరుకుంది. అయితే ఇంతలోనే బీసీసీఐ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ 15 సీజన్కు సంబంధించిన ఆరంభ వేడుకలను నిర్వహించడం లేదని పేర్కొంది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ప్రతి సీజన్ ఆరంభానికి ముందు ఘనంగా ఆరంభ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
కానీ పలు కారణాలతో గత 3 సంవత్సరాలుగా ఐపీఎల్ ఆరంభ వేడుకలను బీసీసీఐ నిర్వహించడంలేదు. ఈ సారి కూడా కలుపుకుంటే వరుసగా 4 సంవత్సరాలు ఆరంభ వేడుకలు లేకుండానే ఐపీఎల్ ప్రారంభంకానుంది. చివరగా 2018 ఐపీఎల్ సీజన్లో ఐపీఎల్ ఆరంభ వేడుకులన నిర్వహించారు. ఆ తర్వాతి ఏడాది ఆరంభ వేడుకలను నిర్వహించకుండా ఆ కార్యక్రమానికి ఖర్చయ్యే డబ్బును బీసీసీఐ పుల్వామా దాడిలో వీర మరణం పొందిన జవాన్ల కుటుంబాలకు అందజేసింది. తద్వారా పుల్వామా దాడిలో వీర మరణం పొందిన జవాన్లకు గుర్తుగా 2019 ఐపీఎల్ ఆరంభ వేడుకలను నిర్వహించలేదని చెప్పుకోవాలి. ఇక ఆ తర్వాతి నుంచి కరోనా మొదలు కావడంతో 2020, 2021 ఏడాది ఐపీఎల్ సీజన్లలోనూ ఆరంభ వేడుకలను నిర్వహించలేదు. తాజాగా దేశంలో కరోనా కేసులు తగ్గినప్పటికీ చైనాలో కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కరోనా మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటికనుగుణంగానే ఈ సారి కూడా ఐపీఎల్ ఆరంభ వేడుకలను నిర్వహించవద్దని బీసీసీఐ నిర్ణయించింది.
ఇక ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 15లో మొత్తం 74 మ్యాచ్లు జరగనున్నాయి. లీగ్ స్టేజ్లో 70 మ్యాచ్లు జరగనుండగా.. ప్లేఆఫ్స్లో 4 మ్యాచ్లు జరగనున్నాయి. మే 29న జరిగే ఫైనల్ మ్యాచ్తో టోర్నీ ముగియనుంది. మ్యాచ్లన్నీ ముంబైలోని 4 స్టేడియాల్లోనే జరగనుండడం గమనార్హం.