
బెంగళూరు: వెస్టిండీస్ ఆల్రౌండర్ ఓడియన్ స్మిత్ను పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. కోటీ రూపాయల కనీస ధరతో ఐపీఎల్ 2022 మెగా వేలంలోకి వచ్చిన స్మిత్ను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ 6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. స్మిత్ను పంజాబ్.. రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్తో పోటీ పడి కొనుగోలు చేసింది. ఇటీవల భారత్ వేదికగా టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరిగిన వన్డే సిరీస్లో రాణించడం స్మిత్కు కలిసొచ్చింది. ఈ సిరీస్లో బ్యాట్తో, బాల్తో ఈ పేస్ ఆల్ రౌండర్ సత్తా చాటాడు. మిగతా వెస్టిండీస్ ఆటగాళ్లు విఫలమైన స్మిత్ మాత్రం రాణించాడు. దీంతో వేలంలో ఓడియన్ స్మిత్కు మంచి ధర లభించింది. కాగా ఐపీఎల్లో ఆడడం ఓడియన్ స్మిత్కు ఇదే తొలిసారి కావడం గమనార్హం.
కాగా రెండో రోజు కూడా ఐపీఎల్ మెగా వేలం ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటివరకు సాగిన వేలంలో సౌతాఫ్రికా బ్యాటర్ ఐడెన్ మాక్రమ్ను సన్రైజర్స్ హైదరాబాద్ 2.60 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఇక టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానేను కోల్కతా నైట్ రైడర్స్ కోటి రూపాయలకు కొనుగోలు చేసింది. మన్దీప్ సింగ్ను ఢిల్లీ క్యాపిటల్స్ కోటి 10 లక్షల రూపాయలకు దక్కించుకుంది. రెండో రోజు ఇప్పటివరకు జరిగిన వేలంలో లివింగ్ స్టోన్ అత్యధిక ధర పలికాడు. లివింగ్ స్టోన్ను పంజాబ్ కింగ్స్ 11 కోట్ల 50 లక్షల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసింది. అలాగో మార్కో జెన్సన్ను సన్రైజర్స్ హైదరాబాద్ 4 కోట్ల 20 లక్షల రూపాయలకు దక్కించుకుంది.
ఇక రెండో రోజు ఐపీఎల్ మెగా వేలంలోకి పంజాబ్ కింగ్స్ 28 కోట్ల రూపాయలతో, ముంబై ఇండియన్స్ 27 కోట్ల రూపాయలతో అడుగుపెట్టాయి. చెన్నైసూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ వద్ద 20 కోట్ల రూపాయల చొప్పున ఉన్నాయి. ఇక గుజరాత్ టైటాన్స్ వద్ద 18 కోట్ల రూపాయలు, ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద 16 కోట్ల రూపాయలు మిగిలి ఉన్నాయి. కోల్కతా నైట్రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ వద్ద 12 కోట్ల రూపాయల చొప్పున ఉన్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వద్ద 9 కోట్ల రూపాయలు, లఖ్నవూ సూపర్ జెయింట్స్ వద్ద దాదాపు 7 కోట్ల రూపాయలు ఉన్నాయి.