కడవరకు క్రీజులో నిలిచిన గిల్
ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ యువ ఓపెనర్ శుభ్మాన్ గిల్ 49బంతుల్లో 63పరుగులతో నాటౌట్గా కడదాకా క్రీజులో నిలిచి జట్టు 144పరుగులు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాక టైటాన్స్ ఇన్నింగ్స్లో శుభ్మాన్ గిల్ కీలకంగా మారాడు. గేమ్లో టాప్ ఆర్డర్ నిరాశపరిచింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 11) కూడా తొందరగానే ఔటయ్యాడు. ఈ క్రమంలో గిల్, డేవిడ్ మిల్లర్ (26), రాహుల్ తెవాతీయా (22*)తో కలిసి టైటాన్స్ను ఇన్నింగ్స్ను నడిపించాడు. పిచ్ స్వభావం రీత్యా 140, 150 విన్నింగ్ స్కోరు అని పరిగణనను తీసుకున్న శుభ్ మాన్ అందుకు తగ్గట్లు వికెట్ చేజార్చుకోకుండా రాణించాడు.
గిల్ కీలక ఇన్నింగ్స్పై ఎగతాళి
శుభ్మాన్ గిల్ అత్యంత కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. తొలి ఇన్నింగ్స్ జరుగుతున్న టైంలో ఫ్యాన్స్ మాత్రం అతని ఆటను సోషల్ మీడియాలో ఎగతాళి చేశారు. సెల్ఫీష్ గేమ్ ఆడుతున్నాడంటూ విమర్శలు గుప్పించారు. ఓపెనర్ అయినప్పటికీ రన్ స్కోరింగ్లో నెమ్మదిగా వ్యవహరించాడని ట్విట్టర్లో పలువురు కామెంట్లు పెట్టారు. శుభ్మాన్ తన ఇన్నింగ్స్ను 128.57స్ట్రైక్ రేట్తో ముగించాడు. ఈ స్ట్రైక్ రేట్ సరిపోదని కామెంట్లలో గిల్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ రెండో ఇన్నింగ్స్ చూశాక.. నెటిజన్ల మైండ్ సెట్ మారే ఉంటుంది. ఈ మ్యాచ్లో ఒక్క బ్యాటర్ కూడా 30పరుగులు మించి రాణించలేదు. అలాంటిది గిల్ 63పరుగులు చేశాడంటే ఆడు మగాడ్రా బుజ్జీ అన్నట్లు మళ్లీ గిల్కు ప్రశంసలు దక్కాయి. ఈ మ్యాచ్ లో గిల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సైతం అందుకున్న సంగతి తెలిసిందే.
తాబేలు, కుందేలు కథ చెప్పి నోరు మూయించాడు
ఈ విజయం అనంతరం యువ ఓపెనర్ శుభ్మాన్ గిల్ తనపై సెల్ఫీష్ గేమ్ ఆడావంటూ వచ్చిన విమర్శలకు గట్టి బదులిచ్చాడు. ఈ మేరకు ఓ చీకీ ట్వీట్ను పోస్ట్ చేశాడు. తాబేలు, దాని వెనక కుందేలు ఉన్న ఎమోజీని ట్వీట్లో పోస్ట్ చేశాడు. దీని అర్థం ఏంటో మనకు తెలిసే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పరుగెత్తి పాలు తాగేదాని కన్నా నిలబడి నీళ్లు తాగడం మేలు అన్నట్లు.. హడావుడిగా స్కోరు చేసి ఔటయ్యే బదులు.. కాస్త నిదానంగా ఇన్నింగ్స్ ను నిర్మించి గెలవడమే ముఖ్యం అని శుభ్ మాన్ చెప్పకనే చెప్పేశాడు. దీంతో ట్రోలర్స్ నోళ్లు మూయించాడు.
సత్తా చాటిన గుజరాత్ బౌలర్లు
ఇక ఈ మ్యాచ్లో గుజరాత్ బౌలర్లు చెలరేగిపోయారు. 145పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో మహ్మద్ షమీ 3ఓవర్లు వేసి కేవలం 5పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. యష్ దయాళ్ 2వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్ 3.5ఓవర్లలో 4వికెట్లు తీసి 24పరుగులు ఇచ్చాడు. తన గింగిరాలు తిప్పే బౌలింగ్తో లక్నో బౌలర్లకు చుక్కలు చూపించి రషీద్.. క్రీజులోకి వచ్చిన బ్యాటర్లను నిలబడనీవ్వకుండా బంతులు వేశాడు. మరో వైపు డెబ్యూ బౌలర్ సాయి కిషోర్ సైతం అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను 2ఓవర్లు వేసి 2వికెట్లు తీసి 7పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో 82పరుగులకే ఆలౌటైన లక్నో 62పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసింది.


Click it and Unblock the Notifications












