
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. టీ20 క్రికెట్లో మరొక 15 పరుగులు చేస్తే ఈ ఫార్మాట్లో 7 వేల పరుగులు చేసిన ఐదో భారత ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. టీ20 ఫార్మాట్లో ధోని ఇప్పటివరకు 6,985 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 1617 పరుగులు చేసిన ధోని, ఐపీఎల్లో 4,796 పరుగులు చేశారు. ఛాంపియన్స్ లీగ్ వంటి ఇతర టీ20 లీగ్ల్లోనూ కొన్ని పరుగులు చేశాడు. అయితే ధోని నేడే ఈ రికార్డు అందుకునే అవకాశాలు ఉన్నాయి.
నేడు లక్నో సూపర్ జెయింట్స్తో చెన్నైసూపర్ కింగ్స్ ఆడబోయే మ్యాచ్లో ధోని 15 పరుగులు చేస్తే ఈ రికార్డును అందుకుంటాడు. కాగా ధోని కంటే ముందు ఆ ఫార్మాట్లో 7 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రాబిన్ ఊతప్ప ఉన్నారు. కాగా ఈ ఫార్మాట్లో ఇప్పటివరకు విరాట్ కోహ్లీ 10,326 పరుగులు, రోహిత్ శర్మ 9,936, శిఖర్ ధవన్ 8,818, రాబిన్ ఊతప్ప 7,070 పరుగులు చేశారు.
కాగా చెన్నైసూపర్ కింగ్స్ ఆరంభ మ్యాచ్లో ఓడినప్పటికీ మహేంద్ర సింగ్ ధోని మాత్రం తన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో 38 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. టీం కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్కు వచ్చిన ధోని జట్టును ఆదుకుని పటిష్ట స్థితిలో నిలిపాడు. అయితే అతనికి ఇతర బ్యాటర్ల నుంచి మద్దతు లభించకవపోవడంతో టీంకు భారీ స్కోర్ అందించలేకపోయాడు.

ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో నేడు మరో ఆసక్తిర పోరు జరగబోతుంది. నేటి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్, కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. బ్రబోర్న్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇక ఇరు జట్లు తమ ఆరంభ మ్యాచ్లో ఓడిపోయాయి. దీంతో ఈ మ్యాచ్లో గెలిచి లీగ్లో తమ విజయాల ఖాతా తెరవాలని రెండు జట్లు కూడా పట్టుదలగా ఉన్నాయి.