

వాంఖడే: ఐపీఎల్ 2022 తొలి మ్యాచే చెన్నైసూపర్ కింగ్స్ అభిమానులకు కావాల్సినంత పండుగ వాతావారణాన్ని తీసుకొచ్చింది. ఆ జట్టు సీనియర్ బ్యాటర్ మహేంద్రసింగ్ ధోని చాలా కాలం తర్వాత తనలోని పాత ఆటగాడిగా చూపించి తలైవా ఇజ్ బ్యాక్ అనిపించాడు. ధనా ధన్ బ్యాటింగ్తో పీకల్లోతు కష్టాల్లో పడిన సీఎస్కేను ఆదుకోని జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ను అందించాడు. ఈ క్రమంలో ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి మరి హాఫ్ సెంచరీ కొట్టి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, ఒక సిక్సు ఉన్నాయి. ధోని చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. దీంతో కేకేఆర్ ముందు 132 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నైసూపర్ కింగ్స్ను కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్ ఉమేష్ యాదవ్ తొలి ఓవర్లోనే దెబ్బ కొట్టాడు. గత ఏడాది పర్పుల్ క్యాప్ అందుకున్న ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ను డకౌట్గా ఫెమిలియన్ పంపాడు. నితీష్ రానాకు క్యాచ్ ఇచ్చి గైక్వాడ్ వెనుదిరిగాడు. ఇక ఐదో ఓవర్లో సీఎస్కేను ఉమేష్ యాదవ్ మరో సారి దెబ్బకొట్టాడు. 8 బంతుల్లో 3 పరుగులే చేసిన డేవాన్ కాన్వేను ఫెమిలియన్ పంపాడు. దీంతో సీఎస్కే 28 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. కాసేపటి తర్వాత సీఎస్కేను ఆదుకునే ప్రయత్నం చేసిన రాబిన్ ఊతప్పను వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో కేకేఆర్ వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ అద్భుతంగా స్టంప్ ఔట్ చేశాడు. భారీ షాట్ కోసం ముందుకెళ్లి ఆడే ప్రయత్నం చేసిన ఊతప్ప లైన్ మిసవ్వడంతో 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఫెమిలియన్ చేరాడు. ఆ కాసేపటికే జడేజాతో సమన్వయ లోపం కారణంగా అనవసర పరుగుకు ప్రయత్నించి రాయుడు (15) రనౌట్ అయ్యాడు. ఆ కాసేపటికే శివమ్ దూబే (3)ను రసూల్ ఔట్ చేయడంతో 11 ఓవర్లలో 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి సీఎస్కే పీకల్లోతు కష్టాల్లోపడింది.
ఈ క్రమంలో కెప్టెన్ రవీంద్ర జడేజా, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సీఎస్కేను ఆదుకున్నారు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడిన వీరిద్దరు క్రీజులో కుదురుకున్నాక చివరి ఓవర్లలో చెలరేగారు. ఈ క్రమంలో ఆరో వికెట్కు అజేయంగా 70 పరుగులు జోడించారు. ధోని 38 బంతుల్లోనే 50 పరుగులతో అజేయంగా నిలవగా.. జడేజా 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. రసూల్ వేసిన చివరి ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. కేకేఆర్ బౌలర్లలో ఉమేష్ యాదవ్ 2, వరుణ్ చక్రవర్తి, ఆండ్రూ రసెల్ తలో వికెట్ తీశారు.