

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. సగం టోర్నమెంట్ కూడా ముగిసిన తరువాత తొలి విజయాన్ని అందుకుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ను మట్టి కరిపించింది. అయిదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తన తదుపరి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. ఇంకో నాలుగు బంతులు మిగిలివుండగానే ఈ లక్ష్యాన్ని ఛేదించింది ముంబై.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్లో సూర్యకుమార్ యాదవ్, హైదరాబాదీ తిలక్ వర్మ రాణించారు. కేప్టెన్ రోహిత్ శర్మ రెండు పరుగులకే వెనుదిరిగినప్పటికీ.. వెనుకంజ వేయలేదు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సూర్యకుమార్ యాదవ్ 39 బంతుల్లో అయిదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 51, హైదరాబాదీ తిలక్ వర్మ 30 బంతుల్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్తో 35 పరుగులు చేశారు. చివర్లో టిమ్ డేవిడ్ దూకుడుగా ఆడాడు. తొమ్మిది బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్తో 20 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఫలితంగా ఇంకా నాలుగు బంతులు మిగిలివుండగానే జట్టు విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్లో బర్త్డే బాయ్ రోహిత్ శర్మ విఫలం అయ్యాడు. రెండు పరుగులే చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో స్వీప్ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 23 పరుగులు. మూడో ఓవర్ రెండో బంతిని స్వీప్ షాట్ ఆడటానికి ప్రయత్నించగా.. అది బ్యాట్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. మిఛెల్ దాన్ని అందుకున్నాడు. ఈజీ క్యాచ్. రోహిత్ మరోసారి తక్కువ పరుగులకే అవుట్ కావడంతో అతని భార్య రితిక సజ్దే కలత చెందింది. ఏడుపుముఖం పెట్టేసింది. అక్కడే ఉండి మ్యాచ్ చూస్తోన్న రవిచంద్రన్ అశ్విన్ భార్య పృథ్వీ నారాయణన్ ఆమెను ఓదార్చడం కనిపించింది.
మ్యాచ్ ముగిసిన అనంతరం మాత్రం రితిక ఆనందానికి హద్దుల్లేవ్. కుమార్తె సమైరా శర్మతో కలిసి ఎంజాయ్ చేసింది ఈ విక్టరీని. సమైరాను చంకనెత్తుకుని గట్టిగా కేకలు వేస్తూ కనిపించిందామె. తోటి ప్లేయర్ల కుటుంబ సభ్యులకు హగ్ ఇచ్చింది. భర్త తక్కువ పరుగులకే అవుట్ అయిన ఆవేదనను మర్చిపోయింది. ఈ విక్టరీని ఎంజాయ్ చేసింది. ఈ సీజన్లో తన భర్త కేప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ సాధించిన తొలి గెలుపును ఆస్వాదించింది.