
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. సగం టోర్నమెంట్ కూడా ముగిసిన తరువాత తొలి విజయాన్ని అందుకుంది. ఇన్ని రోజులూ ఖాళీగా పడి ఉన్న అకౌంట్లో రెండు పాయింట్లను జమ చేసుకుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ను మట్టి కరిపించింది రోహిత్ సేన. అయిదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తన తదుపరి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఈ సీజన్లో కాక మీదున్న ఓపెనర్ జోస్ బట్లర్ మరోసారి భారీ స్కోర్ చేశాడు. 52 బంతుల్లో 67 పరుగులు చేశాడు. టీమ్ మొత్తానికీ అతనే టాప్ స్కోరర్. ముంబై ఇండియన్స్ బౌలర్ల ధాటికి మిగిలిన బ్యాటర్లెవరూ రాణించలేదు. దేవ్దత్ పడిక్కల్ 15, సంజు శాంసన్ 16, మిఛెల్ 17, రియాన్ పరాగ్ 6 పరుగులు చేశారు. చివర్లో రవిచంద్రన్ అశ్విన్.. తొమ్మిది బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్తో 21 పరుగులు చేయడం కొంత ఊరట.
బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడం రాజస్థాన్ రాయల్స్ దూకుడుకు బ్రేకులు వేసింది. బ్యాటర్లెవరినీ కుదురుకోనివ్వలేదు బౌలర్లు. ఎప్పటికప్పుడు వికెట్లు నేల కూల్చారు. ఫలితంగా భారీ భాగస్వామ్యం అనేది ఎక్కడా ఏర్పడలేదు. హృతిక్ షోకీన్, రిలె మెరెడిత్ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. డేనియల్ సామ్స్, కుమార్ కార్తికేయ తలా ఓ వికెట్ తీసుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా ఎప్పట్లాగే వికెట్ లెస్గా ఉండిపోయాడు.
రోహిత్ శర్మ బర్త్డే నాడే- అతని సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో తొలి విజయాన్ని అందుకుంది. ఈ ఘనత బౌలర్లదేనని తేల్చేశాడు రోహిత్ శర్మ. ప్రత్యేకించి- కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్ బౌలింగ్ తనను ఆకట్టుకుందని వ్యాఖ్యానించాడు. తమ అసలు సిసలు సత్తా ఇదేనని పేర్కొన్నాడు. చివరి అయిదు ఓవర్లల్లో బౌలర్లు అద్బుతంగా బంతులను సంధించారని, అంచనాలకు మించి రాణించారని కితాబిచ్చాడు. ఇదే ఊపుతో ఇకపై జరిగే అన్ని మ్యాచ్లల్లోనూ విజయం సాధించగలమని ధీమా వ్యక్తం చేశాడు.
బౌలింగ్కు అనుకూలించిన పిచ్ కావడం వల్ల తొలి ఆరు ఓవర్లల్లోనే సాధ్యమైనన్ని పరుగులు సాధించాలని ప్రణాళికలు వేసుకున్నామని, దీన్ని ఎగ్జిక్యూట్ చేయగలిగామని రోహిత్ శర్మ అన్నాడు. మిగిలిన పిచ్లతో పోల్చుకుంటే డీవై పాటిల్ పిచ్ పూర్తి భిన్నంగా ఉంటుందని, దీనికి అనుగుణంగా ప్రణాళికలను రూపొందించుకున్నామని చెప్పాడు. జోస్ బట్లర్ మీదికి హృతిక్ షోకీన్ను ప్రయోగించాలని నిర్ణయించుకున్నామని, అది సత్ఫలితాలను ఇచ్చిందని పేర్కొన్నాడు.