
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ సెకెండ్ హాఫ్లో వరుసగా రెండు మ్యాచ్లలో పరాజయాన్ని చవి చూసింది గుజరాత్ టైటాన్స్. శుక్రవారం రాత్రి ముంబై సీసీఐ-బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడింది. చివరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ను అవలీలగా గెలుచుకునే అవకాశం ఉన్నా.. దాన్ని చేజేతులా పోగొట్టుకుంది. చివరి ఆరు బంతుల్లో విజయానికి అవసరమైన తొమ్మిది పరుగులను చేయలేక చేతులెత్తేసింది. దీనికి కారణం- రనౌట్లే.
కీలక దశలో హార్దిక్ పాండ్యా, చివరి ఓవర్లో రాహుల్ తెవాతియా రనౌట్ అయ్యారు. ముంబై ఇండియన్స్ బౌలర్ డేనియల్ సామ్స్ వేసిన ఆ ఓవర్ను ఎదుర్కొన్న బ్యాటర్లలో రషీద్ ఖాన్ ఉన్నాడు. రాహుల్ తెవాతియా అవుట్ అయిన తరువాత క్రీజ్లోకి వచ్చాడు రషీద్ ఖాన్. నాలుగో బంతికి సింగిల్ తీసి నాన్స్ట్రైకర్ ఎండ్ వైపు వెళ్లాడు. చివరి రెండు బంతులను డేవిడ్ మిల్లర్ ఎదుర్కొన్నాడు గానీ.. పరుగులు తీయలేకపోయాడు. ఈ రెండు బంతులు కూడా డాట్స్గా మిగిలాయి. ఈ పరిస్థితులను ఉటంకిస్తూ మాట్లాడాడు రషీద్ ఖాన్.
ఈ రెండూ తమ జట్టును ఓటమిపాలు చేశాయని గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ చెప్పాడు. ఇలాంటి నాలుగైదు మ్యాచ్లల్లో తాము ఘన విజయాన్ని అందుకున్నామని, ముంబైపై మాత్రం ఫలితం మరోలా వచ్చిందని వ్యాఖ్యానించాడు. టీ20 అంటే అంతేననీ చెప్పాడు. ఆరు బంతుల్లో 20 పరుగులు అవలీలగా సాధించాల్సిన చోట ఒక్కోసారి 10 పరుగులు కూడా చేయలేమని, ఇది అలాంటి మ్యాచేనని అన్నాడు. క్రికెట్లో ఎప్పుడేం జరుగుతుందనేది ఎవరూ అంచనా వేయలేరని, అది మరోసారి రుజువైందని చెప్పాడు.
మ్యాచ్ మొత్తం మీద తాము చక్కగా ఆడామని, జట్టు ఓపెనర్లు అద్భుతమైన భాగస్వామ్యాన్ని అందించారని రషీద్ ఖాన్ అన్నాడు. గెలవడం తథ్యమనుకున్న దశలో రెండు రనౌట్లు దెబ్బ తీశాయని పేర్కొన్నాడు. చివరి ఓవర్లో ఎనిమిదో, తొమ్మిదో పరుగులు చేయడం కష్టమైన పని కాదని, ఒక్క భారీ షాట్ ఆడితే పరిస్థితులు అనుకూలంగా మారుతాయని అన్నాడు. ఆరు బంతుల్లో తొమ్మిది పరుగులు చేయలేకపోయామని, టీ20 క్రికెట్ బ్యూటీ అంటే అదేనని వ్యాఖ్యానించాడు.