
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో అత్యంత ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లల్లో ఒకటి- ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ మధ్య పోరు. శనివారం రాత్రి వాంఖెడె స్టేడియంలో మధ్య జరిగిన లీగ్ మ్యాచ్లో ఢిల్లీ కేపిటల్స్ ఓడిపోయింది. తన ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. ఢిల్లీ ఓడిపోవడం వల్ల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకోగలిగింది. 16 పాయింట్లతో ఇప్పటికే నాలుగో స్థానానికి చేరిన రాయల్ ఛాలెంజర్స్ జట్టు ప్లేఆఫ్స్ చేరకుండా ఢిల్లీ కేపిటల్స్ అడ్డు పడి ఉండేది.
ముంబై ఇండియన్స్ గెలవాలని కోరుకోని ఆర్సీబీ అభిమాని బహుశా ఉండకపోవచ్చు. చివరికి- ముంబై ఇండియన్స్ అభిమానులు కూడా రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించాలనే కోరుకున్నారు. మ్యాచ్ కొనసాగే సమయంలో ప్లకార్డులను ప్రదర్శించారు. ఆర్సీబీ, ఆర్సీబీ అంటూ నినదించారు. ఎలాగూ ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయినందు వల్ల ఆ అవకాశం ఢిల్లీ కేపిటల్స్కు దక్కకూడదని ప్రేయర్లు సైతం చేసిన అభిమానులు లేకపోలేదు.
ఇవన్నీ ఒక ఎత్తయితే- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్ను అత్యంత ఉత్కంఠభరితంగా వీక్షించడం మరో ఎత్తు. ప్రతి క్షణం ఉత్కంఠతను ఎదుర్కొందీ టీమ్. తాము బస చేసిన హోటల్ లాంజ్లో మ్యాచ్ చూస్తూ గడిపింది ఆర్సీబీ. కేప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, దినేష్ కార్తీక్, హర్షల్ పటేల్, జోష్ హేజిల్వుడ్, మహ్మద్ సిరాజ్, సిద్ధార్థ్ కౌల్, రజత్ పటిదార్, మహిపాల్ లోమ్రార్.. ఇలా స్క్వాడ్ మొత్తం ముంబై ఇండియన్స్-ఢిల్లీ కేపిటల్స్ మ్యాచ్ తిలకించింది.
మ్యాచ్ ముంబై వశమైన వెంటనే ఆర్సీబీ ప్లేయర్లు చిన్నపిల్లల్లా మారిపోయారు. ఎగిరి గంతులేశారు. తామే గెలిచినంతగా సంతోషపడ్డారు. పరస్పరం హగ్ చేసుకుంటూ అభినందనలు తెలుపుకొన్నారు. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ చిన్నపిల్లల్లా మారిపోయారు. ఢిల్లీ కేపిటల్స్ ఓడిపోవడం వల్ల ప్లేఆఫ్స్కు చేరుకునే అవకాశం రాయల్ ఛాలెంజర్స్కు దక్కడమే వారి ఆనందానికి కారణం. ప్లేఆఫ్స్లో ఆర్సీబీ- లక్నో సూపర్ జెయింట్స్ను ఎదుర్కొంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్ అది. 25వ తేదీన బుధవారం నాడు ఎలిమినేటర్ ఉంటుంది.
ఇందులో ఓడిన జట్టు టోర్నమెంట్ నుంచి వైదొలగిపోతుంది. గెలిచిన జట్టు ఫైనల్స్కు అర్హత సాధించినట్టు కాదు. రెండో క్వాలిఫయర్ అగ్నిపరీక్షను ఎదుర్కొనాల్సి ఉంటుంది. తొలి క్వాలిఫయర్లో గెలిచిన జట్టుతో తలపడుతుంది. ఓడిన జట్టు ఇంటికే. అందులో గెలిస్తేనే- ఫైనల్స్కు అర్హత సాధిస్తుంది. రెండో క్వాలిఫయర్- ఏ జట్ల మధ్య ఉంటుందనేది ఈ రెండు మ్యాచ్లు ముగిసిన తరువాతే స్పష్టమౌతుంది. రెండో క్వాలిఫయర్ ఈ నెల 27వ తేదీన ఉంటుంది.