
లక్నోలోకి బంగ్లా బౌలర్
ఇంగ్లండ్ బౌలర్ మార్క్ వుడ్ స్థానంలో బంగ్లాదేశ్ బౌలర్ తస్కిన్ అహ్మద్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. 27 ఏళ్ల ఈ బంగ్లాదేశ్ స్టార్ పేసర్ కొత్త బంతితో ఆరంభంలోనే వికెట్లు పడగొట్టగలడు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేయగలడు.
దీంతో తస్కిన్ అహ్మద్ను జట్టులోకి తీసుకోవడానికి లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ ఆసక్తి కనబరుస్తున్నాడని సమాచారం. ఇదే విషయమై గౌతం గంభీర్ ఆదివారం సాయంత్రమే ఢాకాకు ఫోన్ చేసిన మాట్లాడినట్లు తెలుస్తోంది. "బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ తస్కిన్ అహ్మద్ లక్నో జట్టులో ఉండాలని నేను అనుకుంటున్నాను. అతన్ని మొత్తం సీజన్ కోసం జట్టులోకి తీసుకుంటాం.
అతను ఈ ఆఫర్కు అంగీకరిస్తే, దక్షిణాఫ్రికాతో బంగ్లాదేశ్ ఆడబోయే రెండు టెస్టుల కంటే ముందే తస్కిన్ భారత్కు రావాల్సి ఉంటుంది" అని గౌతం గంభీర్ పేర్కొన్నట్లు సమాచారం. అయితే మోచేయి గాయంతో మెగా వేలంలో 7.5 కోట్ల రూపాయలకు లక్నో కొనుగోలు చేసిన ఇంగ్లండ్ పేస్ బౌలర్ మార్క్ వుడ్ ఐపీఎల్ 2022కు దూరమైన సంగతి తెలిసిందే.

టెస్టు సిరీస్కు దూరం
గౌతం గంభీర్ ఇచ్చిన ప్రతిపాదనపై టీమ్ మేనేజ్మెంట్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)తో చర్చించేందుకు తనకు కొంత సమయం కావాలని తస్కిన్ అహ్మద్ అడిగాడట. ప్రస్తుతం అంతా ఫ్రాంచైజీ క్రికెట్ సాగుతుందని, వెళ్లాలనుకునే వారిని ఎవరూ ఆపలేరని, వాస్తవికతను అంగీకరించడంలో బీసీబీ ప్రెసిడెంట్ నజ్ముల్ హసన్ ముందు వరుసలో ఉంటాడని బంగ్లాదేశ్ జట్టు సభ్యుడు కలేర్ కాంత్ పేర్కొన్నాడు.
కాగా బంగ్లాదేశ్ జట్టులో ప్రస్తుతం కీలక బౌలర్గా ఉన్న తస్కిన్ అహ్మద్ సౌతాఫ్రికా పర్యటనలో ఉన్నాడు. అతను లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఆడాలనుకుంటే సఫారీలతో టెస్టు సిరీస్కు దూరమవుతాడు. అయితే టెస్టు సిరీస్ కోసం ఎంపిక చేసిన బంగ్లాదేశ్ జట్టుకు తస్కిన్ అహ్మద్ ఎంపికయ్యాడు.

తస్కిన్ అహ్మద్ రికార్డులు
ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్లో ఆడని తస్కిన్ అహ్మద్ అంతర్జాతీయ టీ20 క్రికెట్లో మాత్రం 33 మ్యాచ్ల్లో 23 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 2/12గా ఉన్నాయి. ఇక 10 టెస్టుల్లో 23 వికెట్లు, 47 వన్డేల్లో 62 వికెట్లు తీశాడు.

లక్నో సూపర్ జెయింట్స్ పూర్తి జట్టు
కేఎల్ రాహుల్ (17 కోట్లు), మార్కస్ స్టొయినిస్ (9.2 కోట్లు), రవి బిష్ణోయ్ (4 కోట్లు), అవేశ్ ఖాన్ (10 కోట్లు), జాసన్ హోల్డర్ (8.75 కోట్లు), కృనాల్ పాండ్య (8.25 కోట్లు), క్వింటన్ డికాక్ ( 6.75 కోట్లు), దీపక్ హుడా (5.75 కోట్లు), మనీశ్ పాండే (4.60 కోట్లు), దుష్మాంత చమీరా (2 కోట్లు), ఎవిన్ లూయిస్ ( 2 కోట్లు), కృష్ణప్ప గౌతమ్ (90 లక్షలు), అంకిత్ సింగ్ రాజ్పుత్ (50 లక్షలు), షాబాజ్ నదీమ్ (50 లక్షలు), కేల్ మయేర్స్ (50 లక్షలు), మనన్ వోహ్రా, ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మోన్సిన్ ఖాన్( వీరందరికీ 20 లక్షలు).


Click it and Unblock the Notifications












