
ధోని కెప్టెన్సీలో మరపురాని విజయాలు
ఐపీఎల్లో మొదటి సీజన్ నుంచి గత సీజన్ వరకు చెన్నైసూపర్ కింగ్స్కు మహేంద్ర సింగ్ ధోనినే కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ క్రమంలో సీఎస్కేకు ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు. ధోని కెప్టెన్సీలో సీఎస్కే 2020లో మినహా ప్రతి ఐపీఎల్ సీజన్లో క్వాలిఫై రౌండ్ చేరింది. ధోని కెప్టెన్సీలో ఐపీఎల్లో 9 సార్లు ఫైనల్ చేరిన చెన్నైసూపర్ కింగ్స్ 4 సార్లు ట్రోఫీ గెలిచింది. ఈ క్రమంలో 207 మ్యాచ్లకు కెప్టెన్సీ చేసిన ధోని 121 మ్యాచ్ల్లో సీఎస్కేను గెలపించాడు. అలాగే ధోని కెప్టెన్సీలో చెన్నైసూపర్ కింగ్స్ రెండు సార్లు ఛాంపియన్స్ లీగ్ టైటిల్ను కూడా గెలుచుకుంది.

వరుసగా నాలుగు సార్లు ఫైనల్కు
ధోని కెప్టెన్సీలో ఐపీఎల్ మెదటి సీజన్లో చెన్నైసూపర్ కింగ్స్ ఫైనల్కు దూసుకెళ్లింది. రెండో సీజన్లో సెమీ ఫైనల్ వరకు వెళ్లింది. ఇక మూడో సీజన్లో (2010) ఛాంపియన్గా నిలిచింది. తద్వారా చెన్నైసూపర్ కింగ్స్ తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుంది. ఆ వెంటనే నాలుగో సీజన్లోనూ (2011) చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్గా అవతరించింది. తద్వారా ఐపీఎల్లో వరుసగా రెండు సార్లు ట్రోఫీ గెలిచిన ఏకైక జట్టుగా సీఎస్కే నిలిచింది. ఇప్పటికీ ఆ రికార్డు పదిలంగా ఉంది. ఇక తర్వాత జరిగిన ఐదు, ఆరో సీజన్లలో కూడా సీఎస్కే ఫైనల్ చేరింది. తద్వారా ధోని కెప్టెన్సీలో వరుసగా నాలుగు సార్లు ఫైనల్ చేరిన చెన్నైసూపర్ కింగ్స్ ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించింది.

రీఎంట్రీలోనే ట్రోఫి
ఏడో సీజన్లో ప్లేఆఫ్స్ చేరిన చెన్నైసూపర్ కింగ్స్, ఎనిమిదో సీజన్లో మళ్లీ ఫైనల్ చేరింది. అయితే ఆ తర్వాత పలు కారణాలతో చెన్నైసూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్లో రెండు సీజన్లపాటు నిషేధానికి గురైంది. ధోని కెప్టెన్సీలోనే 2018లో మళ్లీ తిరిగొచ్చిన చెన్నైసూపర్ కింగ్స్ రీఎంట్రీలోనే ఛాంపియన్గా అవతరించింది. 2019లోనూ ఫైనల్ చేరింది. అయితే అనూహ్యంగా 2020 చెన్నైసూపర్ కింగ్స్ ఫేలవ ప్రదర్శనతో పాయింట్ల టేబుల్లో అట్టడుగును నిలిచింది. కానీ 2021లో మళ్లీ పుంజుకున్న ధోని సేన ఛాంపియన్గా నిలిచింది. దీంతో ఈ సీజన్లో చెన్నైసూపర్ కింగ్స్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగబోతుంది. ఇలా ఐపీఎల్లో చెన్నైసూపర్ కింగ్స్కు ధోని చారిత్రక విజయాలను అందించాడు. దీంతో ధోని చెన్నై సూపర్ కింగ్స్ మారు పేరుగా మారిపోయాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

టీమిండియాకు ఘనమైన విజయాలు
ఒక్క ఐపీఎల్లోనే కాకుండా అంతర్జాతీయ క్రికెట్లోనూ కెప్టెన్గా ధోని తనదైన ముద్ర వేశాడు. మొదటి టీ20 ప్రపంచకప్తోపాటు 2011 వన్డే ప్రపంచకప్ను టీమిండియాకు అందించాడు. టెస్టు క్రికెట్లోనూ భారత జట్టును నంబర్ వన్ ర్యాంకులో నిలబెట్టాడు. ఇక ధోని కెప్టెన్సీలో టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచింది. తద్వారా మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్గా ధోని నిలిచాడు. ఇంతటి ఘనమైన కెప్టెన్సీ చరిత్ర కల్గిన ధోని ఇక ఆ పదవిలో ఉండడనే విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.


Click it and Unblock the Notifications












