
మరో రెండు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో చెన్నైసూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కెప్టెన్సీని ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు అప్పగిస్తున్నట్లు ధోని ప్రకటించాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది.
అలాగే ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను సీఎస్కేకు కెప్టెన్గా నియమిస్తున్నట్లు ఫ్రాంచైజీ సైతం అధికారికంగా ధృవీకరించింది. తద్వారా సీఎస్కే కెప్టెన్సీ చేపట్టబోతున్న మూడో ఆటగాడిగా జడేజా నిలవబోతున్నాడు. సీఎస్కేకు గతంలో సురేష్ రైనా కూడా కెప్టెన్సీ చేశాడు. అయితే పూర్తి స్థాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నది మాత్రం ధోని తర్వాత జడేజానే కావడం గమనార్హం.
కాగా మెగా వేలానికి ముందే రవీంద్ర జడేజాను చెన్నైసూపర్ కింగ్స్ 16 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది. అప్పటి నుంచే జడేజానే ఈ సీజన్లో చెన్నైకి కెప్టెన్గా ఉంటాడనే వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత సీఎస్కే మేనేజ్మెంట్ ఈ వార్తలను ఖండించింది. దీంతో ఈ సారి కూడా ధోనినే కెప్టెన్గా ఉంటారని అంతా భావించారు. ఐపీఎల్ 2022 ప్రారంభానికి సరిగ్గా రెండు రోజులు ముందు రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ అప్పగిస్తున్నట్లు ప్రకటించి 40 ఏళ్ల ధోని అందరికీ షాక్ ఇచ్చాడు.
కాగా ధోని కెప్టెన్సీలో చెన్నైసూపర్ కింగ్స్ తిరుగులేని టీంగా అవతరించింది. అతని నాయకత్వంలో చెన్నై 4 ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకుంది. రికార్డు స్థాయిలో సీఎస్కేను ధోని 9 సార్లు ఫైనల్ చేర్చాడు. కెప్టెన్గా ధోని 204 మ్యాచ్ల్లో పని చేయగా చెన్నై 121 మ్యాచ్ల్లో గెలిచింది. ఇక కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టబోతున్న రవీంద్ర జడేజా 2012 నుంచి సీఎస్కే తరఫున ఆడుతున్నాడు. లీగ్లో ఆ జట్టు లేని రెండు సీజన్లు మాత్రమే ఇతర టీంలకు ఆడాడు.