ముంబై: ఐపీఎల్ 2022 ప్లేఆఫ్స్ ముంగిట్లో లక్నో సూపర్ జెయింట్స్ మరోసారి పల్టీ కొట్టింది. సెకెండ్ హాఫ్ చివరి వరకు వరుస విజయాలతో అగ్రస్థానానికి చేరుకున్న ఈ కొత్త జట్టు.. ప్లేఆఫ్స్ ముగింట్లో తడబడుతోంది. ఒక్క మ్యాచ్ గెలిస్తే దర్జాగా ప్లేఆఫ్స్లో అడుగు పెట్టే అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకుంటోంది. ప్లేఆప్స్ చేరుకోవడం ఖాయమే అయినప్పటికీ.. తాజాగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమితో- ఇతర జట్ల ఈక్వేషన్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది.
టోర్నమెంట్ చిట్టచివరి దశకు చేరుకున్న స్థితిలో లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా రెండు మ్యాచ్లల్లో ఓటమిపాలు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్.. 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఆ స్కోర్ను ఛేదించలేకపోయింది లక్నో సూపర్ జెయింట్స్. 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 154 పరుగులే చేయగలిగింది. మిడిలార్డర్ బ్యాటర్ దీపక్ హుడా మాత్రమే హాఫ్ సెంచరీతో రాణించాడు. అతనికి అండగా నిలిచే బ్యాటర్లు లేరు.
బ్యాటింగ్ డిపార్ట్మెంట్ వైఫల్యం వల్లే తాము ఈ మ్యాచ్లో ఓడిపోయామని లక్నో సూపర్ జెయింట్స్ కేప్టెన్ కేఎల్ రాహుల్ తేల్చి చెప్పాడు. బ్యాటర్లు వరుసగా విఫలమౌతున్నారని, అది జట్టు జయాపజయాలను ప్రభావితం చేస్తోందని స్పష్టం చేశాడు. బౌలర్లు రాణిస్తున్నప్పటికీ.. బ్యాటింగ్ విభాగం ఫామ్ కోల్పోవడం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించాడు. సాధారణంగా బ్రబౌర్న్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని, పుణేతో పోల్చుకుంటే ఇది బ్యాటర్లకు స్వర్గధామం వంటిదని అన్నాడు.
ఈ పిచ్పై 178 పరుగులను ఛేదించడం కష్టమేమీ కాదని, ప్రారంభంలో వెంటవెంటనే రెండు వికెట్లను కోల్పోవడం జట్టును ముంచిందని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. ఇదివరకు గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ ఓడిపోవడానికీ బ్యాటింగ్ వైఫల్యమే కారణమని, దీన్ని సరిదిద్దుకోవాల్సిిన అవసరం ఉందని చెప్పాడు. ఇన్నింగ్ ఆరంభంలో మంచి ప్రారంభాన్ని, భాగస్వామ్యాన్ని కల్పించడంపై దృష్టి సారించాల్సి ఉందని, బ్యాటర్లు షాట్ సెలెక్షన్లో చేస్తోన్న తప్పులను పునరావృతం కాకుండా జాగ్రత్తపడతామని అన్నాడు.
కేఎల్ రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో తప్పులేదనిపిస్తుంది స్కోర్ బోర్డ్ చూస్తే. క్రీజ్లో పాతుకుపోయిన దీపక్ హుడాకు అండగా నిలిచిన బ్యాటర్లు కరవయ్యారు. కృనాల్ పాండ్యా, మార్కస్ స్టొయినిస్ ఉన్నంత వరకూ ఫర్వాలేదనిపించుకున్నారే గానీ- చివరికంటా నిలవలేకపోయారు. కృనాల్-23, స్టొయినిస్-27 పరుగులు చేశారు. క్వింటన్ డికాక్-7, కేఎల్ రాహుల్-10, ఆయుష్ బదోని-0, జేసన్ హోల్డర్-1, దుష్మంత చమీర-0, తక్కువ స్కోర్కే అవుట్ అయ్యారు. దీపక్ హుడా హాఫ్ సెంచరీ వృధా అయింది.