
రాజస్థాన్ రాయల్స్ చేతిలో..
టోర్నమెంట్ చిట్టచివరి దశకు చేరుకున్న స్థితిలో లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా రెండు మ్యాచ్లల్లో ఓటమిపాలు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తొలుత గుజరాత్ టైటాన్స్.. అనంతరం రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడింది. ముంబైలోని సీసీఐ-బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 24 పరుగుల తేడాతో కుదేల్ అయింది. ఈ మ్యాచ్లో ఘన విజయంతో రాజస్థాన్ రాయల్స్.. ప్లేఆఫ్స్కు మరింత చేరువైంది.

జోస్ అవుట్ అయినా..
తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్.. 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి రాణించాడు. 41 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ తక్కువ స్కోర్కే అవుట్ అయినప్పటికీ.. సంజు శాంసన్-32, దేవ్దత్ పడిక్కల్-39, రియాన్ పరాగ్-19, జిమ్మీ నీషమ్-14 పరుగులు చేయడంతో రాజస్థాన్178 పరుగులు చేయగలిగింది. ఆ స్కోర్ను ఛేదించలేకపోయింది లక్నో సూపర్ జెయింట్స్.

ప్రారంభంలోనే వికెట్ పడగొట్టినా..
జోస్ బట్లర్ను రెండు పరుగులకే అవుట్ చేసినప్పటికీ.. దాన్ని సొమ్ము చేసుకోలేకపోయారు లక్నో జెయింట్స్ బౌలర్లు. రెండో ఓవర్ రెండో బంతికి అవేష్ ఖాన్ బౌలింగ్లో వెనుదిరిగాడో జోస్. అప్పటికి జట్టు స్కోరు 11 పరుగులే. ఆ ఒత్తిడిని కొనసాగించలేకపోయారు. 75 పరుగుల వద్ద రెండో వికెట్ పడింది. ఫస్ట్ డౌన్లోకి దిగిన సంజు శాంసన్.. ఓపెనర్ జైస్వాల్తో కలిసి రెండో వికెట్ భాగస్వామ్యానికి 64 పరుగులను జోడించాడు. ఇదే బిగ్గెస్ట్ పార్ట్నర్షిప్. ఆ తరువాత వెనుదిరిగి చూసుకునే అవకాశమే లేకుండా పోయింది రాజస్థాన్.

ఫలించని ఆ ప్రయోగం..
ఈ మ్యాచ్లో ఓ ప్రయోగం చేసింది లక్నో జెయింట్స్.. లోయర్ మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగే ఆయుష్ బదోనిని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు జరిపింది. వన్డౌన్గా క్రీజ్లో దింపింది. అది ఏ మాత్రం సక్సెస్ కాలేదు. ఆయుష్ బదోని గోల్డెన్ డక్ అయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే ఎల్బీగా వెనుదిరిగాడు. ట్రెంట్ బౌల్ట్ సంధించిన మిడిల్ స్టంప్ మీదికి దూసుకొచ్చిన బంతి అతని ప్యాడ్స్ను తాకింది. క్లియర్ అవుటే అయినప్పటికీ.. బదోని రివ్యూ తీసుకుని, దాన్ని వృధా చేశాడు. బదోని అవుట్.. జట్టుపై ఒత్తిడిని పెంచింది.

హుడాకు అండగా..
క్రీజ్లో పాతుకుపోయిన దీపక్ హుడాకు అండగా నిలిచిన బ్యాటర్లు కరవయ్యారు. కృనాల్ పాండ్యా, మార్కస్ స్టొయినిస్ ఉన్నంత వరకూ ఫర్వాలేదనిపించుకున్నారే గానీ- చివరికంటా నిలవలేకపోయారు. కృనాల్-23, స్టొయినిస్-27 పరుగులు చేశారు. 116 పరుగుల వద్ద దీపక్ హుడా అవుట్ అయ్యాడు. చిట్టచివరి ఆశ- జేసన్ హోల్డర్ కూడా లోస్కోర్కే వెనుదిరిగాడు. దీనితో లక్నో జెయింట్స్ ఓటమి లాంఛనప్రాయమే అయింది.

బౌలర్లకు దాసోహం..
రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ సత్తా కనిపించిందీ మ్యాచ్లో. బౌలర్లందరూ వికెట్లు తీశారు. లక్నో జెయింట్స్ బ్యాటర్లను క్రీజ్లో కుదురుకోనివ్వలేదు. స్వేచ్ఛగా షాట్లు ఆడనివ్వలేదు. అలా బ్యాట్ ఊపిన ప్రతీసారి వికెట్లు లేచాయ్. లైన్ అండ్ లెంగ్త్కు కట్టుబడి బంతులను సంధించారు. ట్రెంట్ బౌల్ట్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నాలుగు ఓవర్ల కోటాలో 18 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ-2, ఒబెద్ మెక్కే-2, యజువేంద్ర చాహల్-1, రవిచంద్రన్ అశ్విన్-1 వికెట్ పడగొట్టారు.


Click it and Unblock the Notifications












