
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ మరో చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. ముంబై ఇండియన్స్ను ఏకంగా 36 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్లల్లో అయిదింట్లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్లో.. అనంతరం బౌలింగ్లో సత్తా చాటిందీ కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో టీమ్. రోహిత్ సేనను ఈ మెగా టోర్నమెంట్ నుంచి బయటికి వెళ్లగొట్టేలా చేసింది.
ఈ మ్యాచ్లో కూడా కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదివరకు ముంబై ఇండియన్స్పైనే సెంచరీ చేశాడు. ఇప్పుడు మళ్లీ అదే జట్టుపై సెంచరీ బాదేశాడు. 62 బంతుల్లో 103 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇందులో 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. జట్టు మొత్తం మీద ఆడింది కూడా అతనొక్కడే. మిగిలిన బ్యాటర్లెవరూ రాణించలేదు. రాహుల్ను కూడా త్వరగా పెవిలియన్ దారి పట్టించి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదేమో.
తోటి ఓపెనర్ క్వింటన్ డికాక్, మనీష్ పాండే, మార్కస్ స్టొయినిస్, కృనాల్ పాండ్యా, దీపక్ హుడా, ఆయుష్ బదోని భారీ స్కోర్ చేయలేకపోయారు. ఉన్నంతలో మనీష్ పాండే ఒక్కడే ఫర్వాలేదనిపించుకున్నాడు. 22 పరుగులు చేశాడు. ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది లక్నో. ఆ లక్ష్యాన్ని కూడా ఛేదించడం ముంబై వల్ల కాలేదు. 132 పరుగుల వద్దే చతికిల పడింది. మ్యాచ్ను గెలిచిన ఆనందంలో ఉన్న సెంచరీ బాయ్ కేఎల్ రాహుల్పై భారీ జరిమానా పడింది.
ఇదివరకు రోహిత్ శర్మ సహా ఒకరిద్దరు కేప్టెన్లు చేసిన తప్పును అతనూ పునరావృతం చేశాడు. స్లో ఓవర్ రన్రేట్ను మెయింటెయిన్ చేశాడు. ఫలితంగా 24 లక్షల రూపాయాల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఇది రెండో తప్పు. ఇదివరకు కూడా ముంబై ఇండియన్స్పైనే స్లో ఓవర్ రన్రేట్ను మెయింటెయిన్ చేయడం వల్ల 12 లక్షల రూపాయల జరిమానా చెల్లించాడతను. ముంబైపైనే రెండోసారి కూడా అదే తప్పు చేశాడు. దీనితో జరిమానా మొత్తం డబుల్ అయింది. 24 లక్షల రూపాయలకు చేరింది. కేప్టెన్తో పాటు మిగిలిన 10 మంది ప్లేయర్లూ ఆరు లక్షల రూపాయల చొప్పున ఫైన్ కట్టాల్సి ఉంటుంది.