
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ మరో ఓటమిని అందుకుంది. వరుస విజయాలతో రెండో స్థానంలో నిలిచిన ఈ న్యూ కమ్మర్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయింది. నవీముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఏడు మ్యాచ్లల్లో మూడింట్లో ఓడిన లక్నో.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దిగజారింది. తన తదుపరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను ఎదుర్కొనబోతోంది.
మంగళవారం రాత్రి నాటి మ్యాచ్లో కేప్టెన్ కేఎల్ రాహుల్, ఆల్రౌండర్ మార్కస్ స్టొయినిస్.. ఐపీఎల్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించాడు. ఏ కారణంతో అతను కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించాడనేది ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించలేదు. అతను ప్రవర్థన నియమావళిని ఉల్లంఘించాడని మాత్రం స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుడల చేశారు. దీన్ని లెవెల్ 1 అఫెన్స్గా అభివర్ణించారు. దీనితో రాహుల్పై జరిమానా పడింది. జరిమానా కింద అతనికి రావాల్సిన మ్యాచ్ ఫీజులో 20 శాతం మేర కోత పడనుంది.
ఇదివరకు స్లో ఓవర్ రన్రేట్ కారణంగా కేఎల్ రాహుల్పై భారీ జరిమానా పడిన విషయం తెలిసిిందే. 12 లక్షల రూపాయల జరిమానాను చెల్లించాల్సి వచ్చిందతనికి. ఇప్పుడు తాజాగా మరోసారి అతనికి దక్కాల్సిన మ్యాచ్ ఫీజులో కోతపడింది. అలాగే- ఫీల్డ్ అంపైర్పై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన ఆల్రౌండర్ స్టొయినిస్ ప్రవర్తన కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కిందికే వస్తుందని నిర్వాహకులు తెలిపారు. అతణ్ని మందలింపుతో వదిలిపెట్టారు.

టాప్గేర్లోకి వచ్చిన తరువాత మార్కస్ స్టొయినిస్ అవుట్ అయిన విషయం తెలిసిందే. చివరి 12 బంతుల్లో 34 పరుగులు చేయాల్సిన దశలో అతను పెవిలియన్ దారి పట్టాడు. 19వ ఓవర్లో జోష్ హేజిల్వుడ్ వేసిన తొలి బంతిని అంపైర్ వైడ్గా ఇవ్వకపోవడంతో స్టొయినిస్ అసహనానికి గురయ్యాడు. అంపైర్ను ఉద్దేశించి ఏవో సైగలు సైతం చేశాడు. ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనగా నిర్ధారించింది ఐపీల్ మేనేజింగ్ కమిటీ.
రెండో బంతిని కూడా హేజిల్వుడ్ వైడ్గా సంధిస్తాడనే ఉద్దేశంతో స్టంప్స్ను వదిలి కుడివైపునకు వచ్చి బంతిని ఆడబోయాడు. దీన్ని ముందే పసిగట్టిన హేజిల్వుడ్ నేరుగా స్టంప్స్ మీదికి బంతిని సంధించాడు. అవి కాస్తా వికెట్లను గిరాటేశాయి. తొలి బంతికి అంపైర్ అవుట్ ఇవ్వకపోవడం.. రెండో బంతి- తాను అనుకున్న విధంగా పిచ్ కాకపోవడంతో స్టొయినిస్ ఆగ్రహంతో ఊగిపోయాడు. F*** you అంటూ గట్టిగా అరిచాడు. అతని ప్రవర్తన పట్ల మేనేజింగ్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది.