
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో శనివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ప్లేయర్ ఇషాన్ కిషన్ 29బంతుల్లో 45పరుగులు చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ దిగిన ఇషాన్ తన మునుపటి ఆటతో జోరు కనబరిచాడు. వీరిద్దరి దూకుడుకు 7ఓవర్లలోనే తొలి వికెట్కు ముంబై 74పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ ఆరంభంలో తడబడ్డప్పటికీ మెల్లిగా పికప్ పుంజుకుని గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముంబై ఇండియన్స్కు మంచి శుభారంభం దక్కడంలో ఇషాన్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చివరి ఓవర్లో 9పరుగులను డిఫెండ్ చేసుకుని ఈ టోర్నమెంటులో రెండో విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే.
ప్లేఆఫ్ రేసు నుంచి ఇప్పటికే ముంబై వైదొలిగినా.. పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానం కోసం తమ జోరు కనబర్చడానికి సిద్ధమైంది. ఒకవేళ ముంబై తన జైత్రయాత్రను కొనసాగిస్తే మాత్రం.. ప్లేఆఫ్ రేసు ఆసక్తికరంగా మారుతుంది. మిగతా జట్ల ప్లేఆఫ్ అవకాశాలను దెబ్బతీయడంతో పాటు మెరుగుపర్చేలాంటి సమీకరణాలు వెలుగుచూస్తాయి. అయితే 5సార్లు ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న ముంబై జట్టు ఈ సీజన్లో చెత్త ప్రదర్శన చేసిందనే చెప్పాలి. మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో గెలిచి ముంబై కాస్త తన స్థాయిని కాపాడుకోవాలని చూస్తోంది.
ఇక గుజరాత్తో జరిగిన మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ స్ట్రెయిట్ స్క్రీన్ వెనుక అభిమానుల వద్దకు వెళ్లి పలకరించాడు. ఇషాన్ కిషన్ తమవైపు వస్తుండడంతో అభిమానులు కేరింతలతో ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఇషాన్ కిషన్ వారి దగ్గరి వరకు వెళ్లగా.. వాళ్లు అరుస్తూ ముంబై ఆడే తర్వాతి మ్యాచ్ కోసం మేం స్టేడియంకు వస్తామని, ఆ మ్యాచ్లో కిషన్ తప్పకుండా హాఫ్ సెంచరీ చేయాలని ఆశిస్తున్నట్లు కోరారు. ఇషాన్ సైతం థంబ్ చూపిస్తూ ఒకే అన్నట్లు సైగ చేశాడు. ఇక తన గుర్తుగా వారికి తన టోపీని విసిరి అందించాడు. ఆ అభిమానులు ఇషాన్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఉబ్బితబ్బిబ్బయిపోయారు.
రెండు వరుస గేమ్లలో గెలుపొందిన ముంబై ఇక తన చివరి నాలుగు మ్యాచ్లలో కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ దాదాపు ప్లేఆఫ్ అవకాశాలు కోల్పోగా.. మిగిలిన మూడు జట్లు ఇంకా ప్లేఆఫ్ రేసులో కొనసాగుతున్నాయి. దీంతో ఈ మూడు జట్లపై ముంబై గెలిస్తే వాటి ప్లేఆఫ్ అవకాశాలు దెబ్బతినే అవకాశముంది.