
కొత్త ఫ్రాంఛైజీలతో..
కొత్తగా రెండు ఫ్రాంఛైజీలు చేరడం వల్ల మ్యాచ్ల సంఖ్య పెరగబోతోంది. రెండున్నర నెలల పాటు షెడ్యూల్ కొనసాగబోతోంది. అహ్మదాబాద్, లక్నో కేంద్రాలుగా రెండు ఫ్రాంఛైజీలను బీసీసీఐ ఇదివరకే ఎంపిక చేసింది. అహ్మదాబాద్ ఫ్రాంఛైజీనీ సీవీసీ కేపిటల్స్ అనే సంస్థ కొనుగోలు చేసింది. ఇక ఆర్పీ- సంజీవ్ గోయెంకాకు చెందిన కంపెనీ.. లక్నో ఫ్రాంఛైజీని తీసుకుంది. దీనికోసం ఏకంగా 7,000 కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని ఖర్చు చేసింది. రెండు ఫ్రాంఛైజీలు కొత్తగా రావడం వల్ల మ్యాచ్ల సంఖ్య పెరగబోతోంది.

74 మ్యాచ్లు..
అహ్మదాబాద్, లక్నో ఫ్రాంఛైజీలు కొత్తగా రావడంతో ఐపీఎల్ మ్యాచ్ల సంఖ్య మరింత పెరగనుంది. కనీసం 74 మ్యాచ్లు ఆడే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఫైనల్తో కలుపుకొని 74 మ్యాచ్లు ఉండొచ్చు. దీనికి అనుగుణంగా రెండున్నర నెలల పాటు మ్యాచ్లను కొనసాగించాలా? లేక 60 రోజుల్లోనే ముగించాలా అనే విషయం బీసీసీఐ కసరత్తు చేస్తోంది. ఫ్రాంఛైజీలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించింది.

60 రోజులకే పరిమితం చేస్తే..
రెండు నెలలకే ఈ సీజన్ను పరిమితం చేసేలా బీసీసీఐ గనక నిర్ణయం తీసుకుంటే.. రోజూ రెండు మ్యాచ్లు నిర్వహించే అవకాశం ఉంటుంది. సాధారణంగా శని, ఆదివారాల్లో రోజూ రెండు మ్యాచ్లు జరిగేవి. అదే 60 రోజుల్లో 74 మ్యాచ్లను ముగించేయాలంటే వారంలో కనీసం నాలుగు రోజుల్లో రెండు మ్యాచ్లను నిర్వహించేలా బీసీసీఐ తన షెడ్యూల్ను రూపొందించుకోవచ్చని తెలుస్తోంది. దీనిపై ఫ్రాంఛైజీలను సంప్రదించిన తరువాతే తుది నిర్ణయాన్ని తీసుకోవచ్చు.

ఏప్రిల్ 2న తొలి మ్యాచ్
ఐపీఎల్ 2022 సీజన్.. 15వ ఎడిషన్ ఏప్రిల్ 2వ తేదీన ఆరంభం అవుతుంది. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ మొదలవుతుందని తెలుస్తోంది. ఏప్రిల్, మే నెలల పొడవునా ఐపీఎల్ మ్యాచ్లు కొనసాగుతాయి. జూన్ మొదటివారంలో ఫైనల్ నిర్వహించే అవకాశం ఉంది. ఫైనల్ మ్యాచ్ జూన్ మొదటి వారమా? లేక రెండో వారం దాకా పొడిగించాలా? అనేది బీసీసీఐ నిర్ణయించాల్సి ఉంది. ప్రతి జట్టు కూడా 14 మ్యాచ్లను ఆడాల్సి ఉంటుంది. ఆ తరువాత ప్లేఆఫ్స్, ఫైనల్స్ ఉంటాయి.

గందరగోళానికి తెర..
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో- గత రెండు సీజన్లుగా ఐపీఎల్ టోర్నమెంట్ల నిర్వహణ అనేది కొంత గందరగోళంలో పడుతూ వచ్చింది. ఐపీఎల్ 2020 సీజన్ను ముందుజాగ్రత్తతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు షిఫ్ట్ చేసింది బీసీసీఐ. ఈ ఏడాది సగం-సగం నిర్వహించాల్సి వచ్చింది. భారత్లో సగం, మిగిలిన షెడ్యూల్ను ఎమిరేట్స్లో పూర్తి చేయాల్సి వచ్చింది. ఫలితంగా- కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి అప్పట్లో.

స్వదేశంలోనే..
ఇప్పుడు ఆ తరహా పరిస్థితులు లేవు. దేశంలో కరోనా వైరస్ తీవ్రత చాలావరకు తగ్గింది. రోజువారీ కేసుల సంఖ్య 10 వేలకు కాస్త అటు ఇటుగా రికార్డవుతున్నాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా జోరుగా సాగుతోంది. 116 కోట్ల మందికి పైగా ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. దేశంలో కరోనాకు ముందునాటి పరిస్థితులు నెలకొన్నాయి. జనజీవనం సాధారణంగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో- వచ్చే సంవత్సరం ఐపీఎల్ టోర్నమెంట్ను ఎక్కడ షెడ్యూల్ చేస్తారనే విషయం తేలిపోయింది.

దేశం దాటబోదంటూ..
వచ్చే సంవత్సరం ఐపీఎల్ను ఎక్కడ షెడ్యూల్ చేస్తారనే విషయంపై బీసీసీఐ కార్యదర్శి జయ్ షా ఇదివరకే ఓ స్పష్టత ఇచ్చారు. స్వదేశంలోనే ఈ మెగా ఈవెంట్ను నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. ఇదివరకట్లా దేశం దాటబోదని స్పష్టం చేశారు. మ్యాచ్ల షెడ్యూల్స్, వేదికలు, ఇంకా ఖరారు కావాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ సీజన్ ఫస్ట్ హాఫ్లో సెలెక్ట్ చేసిన స్టేడియాల్లోనే ఐపీఎల్ మ్యాచ్లు సాగాయి. ఈ సారి అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. స్టేడియాల సంఖ్యను పెంచే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications
