
అంతర్జాతీయ పండగ..
మ్యాచ్లు కొనసాగుతున్న కొద్దీ- జట్లల్లో మార్పులు కనిపించవచ్చు. 24, 25, 27 తేదీల్లో ప్లేఆఫ్స్ ఉంటాయి. 29వ తేదీన ఫైనల్ మ్యాచ్ను షెడ్యూల్ చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. కోల్కత ఈడెన్ గార్డెన్స్, గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్లేఆఫ్స్, క్వాలిఫయర్, ఫైనల్ మ్యాచ్లు ఉంటాయి. ఫైనల్స్తో ఈ సీజన్ ముగుస్తుంది. ఫైనల్స్ ముగిసిన కొద్ది రోజుల్లోనే మళ్లీ క్రికెట్ పండగ ఆరంభం కాబోతోంది. ఇక భారత క్రికెట్ జట్టు వరుసగా అంతర్జాతీయ మ్యాచ్లను ఆడుతుంది.

టీ20 సిరీస్ కోసం..
దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్ను ఆడుతుంది భారత్. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఇది. జూన్ 9వ తేదీన తొలి మ్యాచ్ ఆరంభమౌతుంది. చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. రెండో మ్యాచ్ 12వ తేదీన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం, మూడో టీ20 14న మహారాష్ట్రలోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఉంటుంది. 17వ తేదీన నాలుగో మ్యాచ్ గుజరాత్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, 19న చివరి టీ20 ఢిల్లీలో షెడ్యూల్ చేసింది బీసీసీఐ.

26న జట్టు ప్రకటన..
ఈ సిరీస్ కోసం జట్టు ఎంపికపై బీసీసీఐ కసరత్తు ఆరంభించింది. ఈ నెల 26వ తేదీన జట్టును ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం 15 మంది ఆటగాళ్ల పేర్లతో కూడిన జాబితాకు తుదిరూపాన్ని ఇవ్వడంపై బీసీసీఐ సెలెక్షన్ కమిటీ దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఐపీఎల్ 2022 సీజన్లో పెర్ఫార్మెన్స్తో పాటు ప్లేయర్ల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లేయర్లను షార్ట్ లిస్ట్ చేస్తోందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ నెల 23 లేదా 24వ తేదీల్లో రావొచ్చని అంటున్నారు.

23న కీలక భేటీ..
ప్లేయర్ల జాబితాను ఖరారు చేయడానికి బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఈ నెల 23వ తేదీన సమావేశం కానుంది. ముంబైలోని బీసీసీఐ కార్యాలయం దీనికి వేదిక అయింది. ఈ సమావేశానికి కేప్టెన్ రోహిత్ శర్మ కూడా హాజరు కానున్నారు. ఆయన అభిప్రాయాన్ని తీసుకున్న తరువాతే- ఈ జాబితాపై అధికారిక ముద్ర పడుతుంది. 26వ తేదీన ప్లేయర్ల లిస్ట్ను అధికారికంగా ప్రకటిస్తుందని బీసీసీఐ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.

కోహ్లీ సహా..
విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడం దాదాపు ఖాయమైందని అంటున్నారు. అతనితో పాటు కనీసం నలుగురు సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. అదే సమయంలో ఈ సీజన్లో నిలకడగా రాణిస్తోన్న వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ను జట్టులోకి తీసుకోవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. మొదట్లో విజృంభించిన సన్రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రన్ మాలిక్.. తదనంతరం పెద్దగా ప్రభావాన్ని చూపకపోవడం వల్ల అతని పేరును పరిశీలనలోకి తీసుకోకపోవచ్చనీ అంటున్నారు.


Click it and Unblock the Notifications
