ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్టు బిజీ కానుంది. దక్షిణాఫ్రికాతో అయిదు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. అది కొనసాగుతుండగానే ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనకు బయలుదేరాల్సి ఉంది. ఇంగ్లాండ్తో రీషెడ్యూల్ చేసిన ఓ టెస్ట్ మ్యాచ్ను ఆడాల్సి ఉంది. అనంతరం అదే జట్టుతో మూడు చొప్పున టీ20, వన్డే ఇంటర్నేషనల్స్తో తలపడుతుంది. వెస్టిండీస్ పర్యటన సైతం ఇదే ఏడాది షెడ్యూల్ చేసింది బీసీసీఐ.
ఆయా సిరీస్ల కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేయడానికి కసరత్తు పూర్తి చేసింది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడించడానికి ఇవ్వాళ భేటీ కానుంది. సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ, సునీల్ జోషి, మరో ఇద్దరు సెలెక్షన్ కమిటీ సభ్యులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కేప్టెన్ రోహిత్ శర్మ స్పెషల్ ఇన్వైటీలుగా పాల్గొననున్నారు. కాగా నేషనల్ క్రికెట్ అకాడమీ ఛైర్మన్, మాజీ టెస్ట్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఈ భేటీకి హాజరు కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
భారత క్రికెట్ జట్టును రెండుగా విభజించడం ఖాయంగా కనిపిస్తోంది. దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆడబోయే టీ20 టీమ్కు శిఖర్ ధవన్ సారథ్యాన్ని వహించబోతున్నాడు. ఇందులో టీ20 స్పెషలిస్టులను తీసుకోనుంది సెలెక్షన్ కమిటీ. దీనికి వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్గా అపాయింట్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లే జట్టుకు రోహిత్ శర్మ కేప్టెన్గా వ్యవహరిస్తాడు. సీనియర్ ప్లేయర్లను ఈ జట్టు కోసం ఎంపిక చేయనుంది సెలెక్షన్ కమిటీ.
కాగా- సెలెక్షన్ కమిటీ సమావేశం కావడానికి కొన్ని గంటల ముందు కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ కోసం తనను ఎంపిక చేయవద్దంటూ ఆయన బీసీసీఐకి విజ్ఞప్తి చేశారని అంటున్నారు. ఐపీఎల్ 2022 టోర్నమెంట్ ముగిసిన తరువాత కొంత విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచనలో రోహిత్ శర్మ ఉన్నాడని, అందుకే బ్రేక్ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. రోహిత్ శర్మ విశ్రాంతి కోరిన మాట వాస్తవమేనని బీసీసీఐ వర్గాలు ధృవీకరించాయి. ఆయన విజ్ఞప్తి పట్ల సెలెక్షన్ కమిటీ సానుకూలంగా స్పందిస్తుందని అంటున్నారు.
దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కోసం మొత్తం జూనియర్లతో జట్టును నింపేయకుండా రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ వంటి కొంతమంది అనుభవజ్ఞులకు చోటు కల్పించాలని సెలెక్షన్ కమిటీ భావిస్తోంది. తాజాగా రోహిత్ శర్మ చేసిన విజ్ఞప్తితో పునరాలోచనలో పడిందని చెబుతున్నారు. అదే జరిగితే- దక్షిణాఫ్రికాతో సిరీస్కు రోహిత్ శర్మ దూరమౌతాడు. అతని స్థానంలో శిఖర్ ధవన్ను కేప్టెన్గా నియమించడం దాదాపు ఖాయమే. ఇదివరకు శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీ20 జట్టుకు శిఖర్ ధవన్ కేప్టెన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే.