అత్యధిక ఖర్చు ఆ దేశం వారిపైనే
మెగా వేలంలో, అంతకుముందు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల పరంగా అత్యధికంగా తమ డబ్బులను ఫ్రాంచైజీలు భారత ఆటగాళ్ల పైనే ఖర్చు చేశాయి. మొత్తం 137 మంది భారత ఆటగాళ్లపై రికార్డు స్థాయిలో 485.30 కోట్ల రూపాయలను ఖర్చు చేశాయి. టీమిండియా ఆటగాళ్లలో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, హర్షల్ పటేల్ వంటి తదితర ఆటగాళ్లు భారీ ధర పలికారు. కిషన్ను ముంబై 15 కోట్ల 25 లక్షల రూపాయల భారీ ధరకు దక్కించుకోగా, దీపక్ చాహర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ 14 కోట్ల రూపాయలు, శ్రేయస్ అయ్యర్ కోసం కోల్కతా నైట్రైడర్స్ 12 కోట్ల 25 లక్షల రూపాయలను ఖర్చు చేసింది.
ఇంగ్లీష్ ఆటగాళ్లపై భారీగా ఖర్చు
ఇండియా ఆటగాళ్ల తర్వాత ప్రాంచైజీలు అత్యధిక ఖర్చును ఇంగ్లండ్ ఆటగాళ్లపై చేశాయి. ఆ జట్టు ఆటగాళ్లపై ఏకంగా 64.85 కోట్ల రూపాయలు కుమ్మరించాయి. ఆ జట్లు ఆటగాడు జోఫ్రా ఆర్చర్ ఈ సీజన్కు అందుబాటులో ఉండనప్పటికీ అతనికి 8 కోట్ల రూపాయల భారీ ధర వెచ్చించి ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. మిగతా వారిలో జానీ బెయిర్స్టో 5 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాడు. లియామ్ లివింగ్స్టోన్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. అలెక్స్ హేల్స్ను కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. అయితే ఫాంలో లేకపోవడంతో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు.
ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఆటగాళ్లపై భారీగా ఖర్చు
ఫ్రాంచైజీలు అత్యధికంగా ఖర్చు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా మూడో స్థానంలో నిలిచింది. ఆ జట్టు ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు 58.90 కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ను ఢిల్లీ క్యాపిటల్స్, ఆ జట్టు టెస్టు కెప్టెన్ పాట్ కమిన్స్ను కోల్కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేశాయి. ఇక సౌతాఫ్రికా ఆటగాళ్లు నాలుగో స్థానంలో నిలిచారు. సౌతాఫ్రికా ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు 44.30 కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఫాఫ్ డుప్లిసెస్ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది.
న్యూజిలాండ్ ఆటగాళ్లపై
ఈ జాబితాలో న్యూజిలాండ్ ఆటగాళ్లు ఐదో స్థానంలో ఉన్నారు. ఆ దేశ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు 43.35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి. ఆ టీం స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ను రాజస్థాన్ రాయల్స్, డేవాన్ కాన్వేను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేశాయి. ఇక ఆ తర్వాత శ్రీలంక ఆటగాళ్లను ఫ్రాంచైజీలు 14.45 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశాయి. ఈ జాబితాలో ఫ్రాంచైజీలు అతి తక్కువ డబ్బులను బంగ్లాదేశ్ ఆటగాళ్లపై ఖర్చు చేశాయి. ఆ దేశంపై 2 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశాయి. అది కూడా ఆ జట్టు పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను ఢిల్లీ క్యాపిట్స్ 2 కోట్లకు కొనుగోలు చేసింది.