
స్కోర్ బోర్డు ఉరకలు..
నవీముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్-పంజాబ్ కింగ్స్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ 205 పరుగులు చేసింది. తన ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కేప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్.. తన అద్భుతమైన ఫామ్ను ఇక్కడా ప్రదర్శించాడు. 57 బంతుల్లో మూడు ఫోర్లు, ఏడు సిక్సర్లతో 88 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 41, దినేష్ కార్తీక్ 14 బంతుల్లో 32 పరుగులు చేయడంతో స్కోర్ బోర్డు పరుగులెత్తింది.

తప్పని పరాజయం..
అనంతరం బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 206 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఐపీఎల్లో అరంగేట్రం చేసిన రాజ్ బావా మినహా.. బ్యాటర్లందరూ సమష్టిగా రాణించారు. కేప్టెన్ మయాంక్ అగర్వాల్-32, శిఖర్ ధవన్-43, భానుక రాజపక్స-43, లియామ్ లివింగ్స్టోన్-19, మహ్మద్ షారుఖ్ఖాన్-24, ఒడియన్ స్మిత్-25 జట్టును విజయ తీరాలకు చేర్చారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏకంగా 22 ఎక్స్ట్రాలను సమర్పించుకోవడం కూడా ఆ జట్టు కొంపముంచింది.

ఆ ఒక్క ఓవర్..
హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ వేసిన ఒకే ఒక్క ఓవర్.. మ్యాచ్ మొత్తాన్నీ మలుపు తిప్పింది. చివరి మూడు ఓవర్లలో 36 పరుగులు చేయాల్సిన దశలో బౌలింగ్కు దిగిన సిరాజ్.. ఏకంగా 25 పరుగులను సమర్పించకున్నాడు. దెబ్బకు సమీకరణాలన్నీ మారిపోయాయి. లక్ష్యం భారీగా తగ్గింది. సిరాజ్ ఓవర్ ముగిసే సమయానికి- పంజాబ్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 11 పరుగులు. ఇంకో ఓవర్ మిగిలివుండగానే మ్యాచ్ ముగించేసింది.

చితకబాదిన స్మిత్..
సిరాజ్ వేసిన 18వ ఓవర్లో ఒడియన్ స్మిత్ దుమ్ము రేపాడు. 8 బంతుల్లో 25 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 312.50. మూడు సిక్సర్లు, ఒక ఫోర్తో చెలరేగిపోయాడీ విండీస్ వీరుడు. సిరాజ్ వేసిన ఆ ఓవర్ తొలిబంతికి సిక్స్ బాదాడు. రెండో బాల్ వైడ్. ఆ ఎక్స్ట్రా బంతిని ఫోర్గా మిలిచాడు స్మిత్. మూడు, చివరి బంతులను ఫెన్సింగ్ దాటించాడు. ఈ ఓవర్లో 25 పరుగులు వచ్చాయి. ఓవర్ వేయడానికి ముందు 170 పరుగుల వద్ద ఉన్న పంజాబ్ కింగ్స్ స్కోర్ బోర్డు.. అది ముగిసేసరికి 195 వద్దకు వచ్చి చేరింది. అప్పుడే విజయం ఖాయమైంది. విజయానికి కావాల్సిన 11 పరుగులను హర్షల్ పటేల్ వేసిన 19వ ఓవర్లో సాధించారు పంజాబ్ బ్యాటర్లు.

బౌలర్ల వైఫల్యం..
రాయల్ ఛాలెంజర్స్ టీమ్ బౌలర్లందరూ ఘోరంగా విఫలం అయ్యారు. డేవిడ్ విల్లీ, అక్ష్ దీప్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్.. ఏ మాత్రం రాణించలేదు. స్పిన్ ఆయుధం హసరంగ మాయాజాలం ఈ మ్యాచ్లో ఫలించలేదు. నాలుగు ఓవర్లు వేసిన అతను ఒక వికెట్ తీసుకున్నాడు గానీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. నాలుగు ఓవర్లలో 40 పరుగులు ఇచ్చుకున్నాడు. హర్షల్ పటేల్, అక్ష్దీప్దీ అదే పరిస్థితి.

హేజిల్వుడ్ లేని లోటు..
ఆస్ట్రేలియాకు చెందిన టీ20 స్పెషలిస్ట్ బౌలర్ జోష్ హేజిల్వుడ్, ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ అందుబాటులో లేకపోవడం రాయల్ ఛాలెంజర్స్ మైనస్ పాయింట్. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా హేజిల్వుడ్కు పేరుంది. గ్లెన్ మ్యాక్స్వెల్ స్పిన్ బౌలింగ్తో బ్యాటర్లను కట్టడి చేయగలడు. వారిద్దరూ ప్రస్తుతం జట్టుతో లేరు. తమ దేశం తరఫున పాకిస్తాన్తో సిరీస్ ఆడుతున్నారు. ఈ సిరీస్ ముగిసిన తరువాతే అతను ఆర్సీబీతో కలుస్తారు. ఇంకో అయిదు మ్యాచ్ల వరకూ అందుబాటులో ఉండకపోవచ్చు.

నో హాఫ్ సెంచరీ..
నిజానికి 205 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు సాధారణంగా ఒకటో, రెండో హాఫ్ సెంచరీలు నమోదవుతుంటాయి. అలాంటివేవీ పంజాబ్ కింగ్స్లో కనిపించలేదు. ఏ ఒక్క బ్యాటర్ కూడా అర్ధసెంచరీ చేయలేదు. క్రీజ్లో దిగిన బ్యాటర్లందరూ రాణించడంతో అంత పెద్ద లక్ష్యం చిన్నబోయింది. పంజాబ్ స్కోర్ కార్డ్లో కనిపించిన అత్యధిక వ్యక్తిగత పరుగులు 43. ఓపెనర్ శిఖర్ ధవన్, భానుక రాజపక్స 43 పరుగులు చొప్పున చేశారు. కేప్టెన్ మయాంక్ అగర్వాల్తో పాటు మిగిలిన బ్యాటర్లు 100కు పైగా స్ట్రైక్ రేట్ సాధించడంతో విజయం సులభతరమైంది.


Click it and Unblock the Notifications
