14 పరుగుల తేడాతో..
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు భారీ స్కోర్ను నమోదు చేసింది. ఓపెనర్ శుభ్మన్ గిల్-84, హార్దిక్ పాండ్యా-31, డేవిడ్ మిల్లర్-20 రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్ రెండు, కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ తీసుకున్నారు. ఛేజింగ్ దిగిన ఢిల్లీ కేపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ రిషభ్ పంత్-43, లలిత్ యాదవ్-25, రౌమన్ పావెల్-20 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లెవరూ రాణించకపోవడంతో లక్ష్యానికి 14 పరుగుల దూరం వద్ద నిలిచిపోయింది.
వరుసగా రెండో విజయం..
ఈ సీజన్లోనే ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. జట్టుకు వరుస విజయాలను అందించిన హార్దిక్ పాండ్యా కేప్టెన్గా తనను తాను నిరూపించుకున్నాడు. బ్యాటింగ్లో చెప్పుకోదగ్గ స్కోర్ చేసిన ఈ ఆల్రౌండర్ బౌలర్గానూ సత్తా చాటాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీసుకున్నాడు. ఫీల్డింగ్ అరెంజ్మెంట్స్, బౌలర్లను మార్చడం, ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడిని తీసుకుని రావడంలో సక్సెస్ అయ్యాడు. బౌలింగ్ వనరులను సమర్థవంతంగా వినియోగించుకున్నాడు. విజయ్ శంకర్, రాహుల్ తెవాతియా తప్పిస్తే.. మిగిలిన వారు పొదుపుగా బౌల్ చేశారు.

లోకీ బౌలింగ్ హైలైట్..
గుజరాత్ టైటాన్స్ పేసర్ లోకీ ఫెర్గూసన్ బౌలింగ్ స్పెల్ హైలైట్. నాలుగు ఓవర్లల్లో నాలుగు వికెట్లను పడగొట్టాడు. ఓపెనర్ పృథ్వీషా, మన్దీప్ సింగ్, రిషభ్ పంత్, అక్షర్ పటేల్ను పెవిలియన్ దారి పట్టించాడు. క్రీజ్లో కుదురుకుని భారీ షాట్లు ఆడుతున్న సమయంలో హార్దిక్ పాండ్యా..ఫెర్గూసన్కు బంతిని అప్పగించాడు. 15వ ఓవర్ తొలి బంతికే రిషభ్ను బలి తీసుకున్నాడు. 145 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన క్విక్ అవుట్ కట్టర్ను ఆడటంలో రిషభ్ పంత్ విఫలం అయ్యాడు. టైమింగ్ మిస్ అయ్యాడు. అభినవ్ మనోహర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వస్తు వస్తూనే ఫోర్లు బాదిన అక్షర్ పటేల్ను వెనక్కి పంపాడు లోకీ.
గెలుపు గుర్రం అతడే..
పేసర్ వరుణ్ అరోన్ ఒక ఓవర్ను మాత్రమే బౌల్ చేశాడు. అతని కోటాను విజయ్ శంకర్, రాహుల్ తెవాతియాకు భర్తీ చేశారు. తెవాతియా రెండు, విజయ్ శంకర్ ఒక ఓవర్ వేశారు. ఈ మూడు ఓవర్లల్లో 36 పరుగులు వచ్చాయి. అలాంటి సమయంలో ఫెర్గూసన్ మీద పూర్తిగా డిపెండ్ అయ్యాడు హార్దిక్ పాండ్యా. తన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడని హార్దిక్ పాండ్యా ప్రశంసించాడు. ఫెర్గూసన్ తన బౌలింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పాడని వ్యాఖ్యానించాడు.

రిషభ్ పంత్ ఉన్నందున..
మ్యాచ్ ముగిసిన అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడాడు. అవతలి జట్టులో రిషభ్ పంత్ ఉన్నందున తాము 185కు పైగా పరుగులు చేయాల్సి ఉంటుందని బ్యాటింగ్కు దిగేటప్పుడు నిర్ణయించామని పేర్కొన్నాడు. 10-15 పరుగులు తక్కువ చేశామని, బ్యాటింగ్లో తాము వేసుకున్న ప్రణాళికలను పక్కాగా ఎగ్జిక్యూట్ చేయలేకపోయామని చెప్పాడు. బౌలింగ్లో తమ వ్యూహాలు ఫలించాయని అన్నాడు. ప్రత్యర్థిని 20-25 పరుగుల తేడాతో ఓడించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, దానికి అనుగుణంగా తమ గేమ్ సాగిందని చెప్పాడు. లోకీ ఫెర్గూసన్ మ్యాచ్ గతిని మార్చేశాడని చెప్పాడు.


Click it and Unblock the Notifications
