
ఐపీఎల్ 2022లో 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ నిరాశపరుస్తుంది. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో ఓడి పాయింట్ల పట్టికలో ఖాతా తెరవలేదు. ఈ నేపథ్యంలో ఆ జట్టు వైఫల్యాలపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్కు సరైన పేస్ బౌలింగ్ లేదని, ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రాకు సహకరించే మరో పేసర్ లేడని ఇదే ముంబై ఇండియన్స్ పరాజయాలకు కారణమవుతుందని ఆయన అభిప్రాయడ్డాడు. జయదేవ్ ఉనద్కత్, బసిల్ థంపి, డేనియల్ సామ్స్, మిల్స్ వంటి బౌలర్లను ప్రయోగించినా ఫలితం లేకపోయిందన్నాడు. ఇక భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన జోఫ్రా ఆర్చర్ ఈ సీజన్కు అందుబాటులో ఉండకపోవడం దురదృష్టకరమని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. మొత్తంగా ముంబై ఇండియన్స్ బౌలింగ్ బలహీనంగా ఉందని చెప్పాడు.
కానీ ఇలాంటి పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో ముంబై ఇండియన్స్కు బాగా తెలుసని ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు. గతంలో ఆ టీం అనేక సార్లు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొని తర్వాత సత్తా చాటిందని ఆయన గుర్తు చేశాడు. 2015లో అయితే ఏకంగా టైటిలే గెలిచిందని చెప్పాడు. కాగా 2013 నుంచి ఇప్పటివరకు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఒక్కసారి కూడా ఫస్ట్ మ్యాచ్ గెలవలేదు. అయితే అప్పటి టీంకు ఇప్పటి టీంకు వ్యత్యాసం ఉందని ఇది కెప్టెన్ రోహిత్ శర్మకు పెద్ద తలనొప్పి తెచ్చిపెడుతుందని ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆర్డర్లో మాత్రం సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ రాణిస్తున్నారని అన్నాడు. రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్ కూడా రాణిస్తే ముంబై ఇండియన్స్ను ఆపడం ఎవరి తరం కాదని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు.
ముంబై ఇండియన్స్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కీరన్ పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, టిమ్ డేవిడ్, జయదేవ్ ఉనద్కత్, టైమల్ మిల్స్, జోఫ్రా ఆర్చర్, రిలే మెరెడిత్, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్ , మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, బాసిల్ థంపి, అన్మోల్ప్రీత్ సింగ్, డెవాల్డ్ బ్రీవిస్, తిలక్ వర్మ, ఆర్యన్ జుయల్ (వికెట్ కీపర్), అర్జున్ టెండూల్కర్, రమణదీప్ సింగ్, రాహుల్ బుద్ధి, హృతిక్ షోకీన్, సంజయ్ యాదవ్, అర్షద్ ఖాన్.