
అదరగొట్టిన లక్నో..
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 210 పరుగులు చేసింది. రాబిన్ ఊతప్ప-50, శివమ్ దూబే -49, మొయిన్ అలీ-35, అంబటి రాయుడు-27 రాణించారు. అనంతర లక్ష్య చేధనకు దిగిన లక్నో 19.3 ఓవర్లలో 4 వికెట్లను మాత్రమే కోల్పోయి 211 పరుగులు చేసింది. ఎవిన్ లూయిస్-55, ఓపెనర్ క్వింటన్ డికాక్- 61 జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. చివర్లో ఆయుష్ బదోని తొమ్మిది బంతుల్లో రెండు సిక్సర్లతో 19 పరుగులు చేయడం జట్టు విజయానికి బాటలు వేసింది.

భారీ స్కోరును కాపాడుకోలేక..
211 పరుగుల భారీ లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. నలుగురిని మాత్రమే అవుట్ చేయగలిగారంటే వారి బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా మూడు బంతులు మిగిలివుండగానే లక్నో బ్యాటర్లు 210 పరుగులను దాటేశారు. కేప్టెన్గా బాధ్యతలను స్వీకరించిన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా.. మరోసారి దారుణంగా విఫలం అయ్యాడు. బౌలర్గా చేతులెత్తేశాడు. రెండు ఓవర్లు మాత్రమే విసిరిన అతను ఏకంగా 21 పరుగులను సమర్పించుకున్నాడు.

ఓడించిన బౌలర్లు..
ముఖేష్ చౌదరి, తుషార్ దేశ్పాండే, డ్వేన్ బ్రావో, మొయిన్ అలీ, శివమ్ దుబే ధారాళంగా పరుగులు ఇచ్చారు. రెండు వికెట్లను పడగొట్టిన డ్వేన్ ప్రిటోరియస్ ఉన్నంతలో ఫర్వాలేదనిపించుకున్నాడు. శివమ్ దుబే వేసిన ఒకే ఒక్క ఓవర్ జట్టుకు విజయాన్ని దూరం చేసింది. కీలకమైన 19వ ఓవర్లో 25 పరుగులు పిండుకున్నారు బ్యాటర్లు. రెండు ఎక్స్ట్రాలతో మొత్తంగా ఎనిమిది బంతులు విసిరాడా ఓవర్లో. ఈ ఓవర్- లక్నో బ్యాటర్ల మీద ఉన్న ఒత్తిడిని తుడిచిపెట్టేసింది.

వరుసగా రెండో మ్యాచ్లో..
చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా తొలి రెండు మ్యాచ్లల్లో ఓటమిపాలు కావడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. ఇదివరకెప్పుడూ ఇలాంటి సందర్భాన్ని చవి చూడలేదు. ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిపోయి.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచిందీ టీమ్. తొలి మ్యాచ్లో కోల్కత నైట్ రైడర్స్ చేతిలో పరాభవాన్ని చవి చూసిన విషయం తెలిసిందే. తన తదుపరి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను ఎదుర్కొనబోతోంది. ఎల్లుండి సాయంత్రం 7:30 గంటలకు ముంబై బ్రబౌర్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది.


Click it and Unblock the Notifications












