
అహ్మదాబాద్: ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్ ఇంకొన్ని గంటల్లో ఆరంభం కాబోతోంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అంగరంగ వైభవంగా దీన్ని నిర్వహించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. సంజు శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్-హార్దిక్ పాండ్యా నాయకత్వాన్ని వహిస్తోన్న గుజరాత్ టైటాన్స్ ఇవ్వాళ ఫైనల్లో తలపడనున్నాయి. ఈ రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. క్లోజింగ్ సెరిమనీ సెలబ్రేషన్స్ను నిర్వహిస్తోండటం వల్ల మ్యాచ్ అరగంట ఆలస్యంగా ప్రారంభమౌతుంది.
ఈ సీజన్తోనే తన ఐపీఎల్ ప్రస్థానాన్ని ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్.. ఫైనల్స్కు చేరింది. హార్దిక్ పాండ్యా సారథ్యాన్ని వహిస్తోన్న ఈ లోకల్ టీమ్తో- రాజస్థాన్ రాయల్స్ తలపడబోతోంది. ఐపీఎల్ తొలి సీజన్ ఛాంపియన్గా ఆవిర్భవించిన తరువాత మళ్లీ అలాంటి అవకాశాన్ని దక్కించుకుందీ పింక్ టీమ్. ఈ రెండు జట్లు కూడా లీగ్ దశలో తిరుగులేని విజయాలను అందుకున్నాయి. కొమ్ములు తిరిగిన జట్లను ఓడించాయి.
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కత నైట్రైడర్స్.. వంటి మాజీ ఛాంపియన్లపై విజయఢంకా మోగించాయి. ముంబై ఇండియన్స్ అత్యంత దారుణంగా పెర్ఫార్మ్ చేసింది ఈ టోర్నమెంట్లో. ప్లేఆఫ్స్ కాదు కదా.. మ్యాచ్లను గెలవడానికే నానా తంటాలు పడింది. మొత్తం 14 మ్యాచ్లల్లో గెలిచింది నాలుగే. వరుసగా ఎనిమిది మ్యాచ్లను ప్రత్యర్థికి కోల్పోయింది. ఒక్క విజయం కోసం తొమ్మిది మ్యాచ్ల వరకు ఎదురు చూడాల్సిన దుస్థితిని ఎదుర్కొంది.

ఐపీఎల్ 2023 సీజన్ ఖచ్చితంగా ఇలా ఉండబోదని రోహిత్ శర్మ తేల్చి చెప్పాడు. దద్దరిల్లిపోద్దని స్పష్టం చేశాడు. గట్టిగా కొట్టబోతున్నామని, దీనికోసం ముందస్తు ప్రణాళికలను రూపొందించుకుంటామని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ను పురస్కరించుకుని ముంబై ఇండియన్స్ అధికారిక వెబ్సైట్పై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. 2023 ఐపీఎల్ సీజన్లో కొత్త ముంబై ఇండియన్స్ ఆటతీరును చూస్తారని హామీ ఇచ్చాడు. అభిమానులకు తాను మాట ఇస్తున్నానని అన్నాడు.
ముంబై ఇండియన్స్ మిడిలార్డర్ డాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఇదే హామీ ఇచ్చాడు. 2023లో తాము ఆరోసారి ఐపీఎల్ కప్ను ముద్దాడబోతున్నామని అన్నాడు. ఈ సంవత్సరం తమ జట్టును దురదృష్టం వెంటాడిందని వ్యాఖ్యానించాడు. కొన్ని పొరపాట్లు చోటు చేసుకున్నాయని, వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించినప్పటికీ.. సాధ్యం కాలేదని అన్నాడు. మ్యాచ్కు ముందు వేసుకున్న ప్రణాళికలు గ్రౌండ్లో ఇంప్లిమెంట్ చేయలేకపోయామని చెప్పాడు. ఐపీఎల్ 2023లో తాము ఆరోసారి కప్ను అందుకుంటామని భరోసా ఇచ్చాడు.