

అహ్మదాబాద్: రెండున్నర నెలల పాటు అభిమానులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్.. 15వ ఎడిషన్ ముగిసింది. గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్గా ఆవిర్భవించింది. ఐపీఎల్లో అడుగు పెట్టిన తొలి సీజన్లోనే టైటిల్ను సాధించిన జట్టుగా కొత్త చరిత్రను సృష్టించింది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో తన ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్ను చిత్తుగా ఓడించింది. ఏడు వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 130 పరుగులు చేయగలిగింది. ఓపెనర్ జోస్ బట్లర్ ఒక్కడే టాప్ స్కోరర్. 35 బంతుల్లో 39 పరుగులు చేశాడు. అయిదు ఫోర్లు కొట్టాడు. బట్లర్ భారీ స్కోర్ చేయలేకపోవడం వల్ల రాజస్థాన్ రాయల్స్ విజయాన్ని ప్రభావితం చేసింది. టైటిల్ను దూరం చేసింది. బట్లర్ అవుట్ అయిన తరువాత మిగిలిన బ్యాటర్లెవరూ ఎక్కువ సేపు క్రీజ్లో నిలవలేకపోయారు.
ఈ సీజన్లో కప్ను సాధించి.. దివంగత షేన్ వార్న్కు ఘనంగా నివాళి అర్పించాలనుకున్న రాజస్థాన్ రాయల్స్ ఆశలు నెరవేరలేదు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైన తొలి సీజన్లోనే రాజస్థాన్ రాయల్స్ను ఛాంపియన్గా నిలబెట్టాడు షేన్ వార్న్. అప్పటి జట్టుకు అతనే కేప్టెన్. తొలి కేప్టెన్గా.. తొలి సీజన్లోనే జట్టుకు టైటిల్ను అందించడంలో కీలక పాత్ర పోషించాడు. కొద్దిరోజుల కిందటే షేన్ వార్న్ కన్నుమూసిన విషయం తెలిసిందే.
మ్యాచ్ ఆరంభానికి ముందు షేన్ వార్న్కు నివాళి అర్పించింది టీమ్. ఈ సందర్భంగా ఓపెనర్ జోస్ బట్లర్ భావోద్వేగానికి గురయ్యాడు. షేన్ వార్న్ను తలచుకుని కన్నీరు పెట్టుకున్నాడు. తమ ప్రస్థానాన్ని షేన్ వార్న్.. పైనుంచి చూస్తుంటాడని చెప్పాడు. అతని బ్లెస్సింగ్స్ జట్టుకు ఎప్పుడూ ఉంటాయని, ఫైనల్స్లో ఘన విజయం సాధిస్తామని బట్లర్ వ్యాఖ్యానించాడు. వాస్తవ పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా కనిపించింది. గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాభవాన్ని చవి చూసింది.