ముంబై: ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ 2022 టోర్నమెంట్లో ఆడుతున్న యంగ్ క్రికెటర్ డెవాల్డ్ బ్రెవిస్. ఈ సీజన్లోనే అతను ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు. మూడు కోట్ల రూపాయలకు ఈ దక్షిణాఫ్రికా ప్లేయర్ను జట్టులోకి తీసుకుంది ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ. బేబీ ఏబీ డివిలియర్స్గా పిలుచుకుంటున్నారు అభిమానులు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్లను ఆడాడు.. 124 పరుగులు చేశాడు. 49 అతని హయ్యెస్ట్ స్కోర్. 155.00 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడీ డాషింగ్ టాప్ ఆర్డర్ బ్యాటర్. బ్యాటింగ్, ఫీల్డింగ్లో కొన్ని మెరుపులు మెరిపించాడు.
తన ఆటతీరుతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు దృష్టిలో పడ్డాడు. భారత్లో పర్యటించే టీ20 జాతీయ జట్టులో డెవాల్డ్ బ్రెవిస్ను తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఇది. దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానుంది. జూన్ 9వ తేదీన తొలి మ్యాచ్ ఆరంభమౌతుంది. చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. రెండో మ్యాచ్ 12వ తేదీన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం, మూడో టీ20 14న మహారాష్ట్రలోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఉంటుంది.
17వ తేదీన నాలుగో మ్యాచ్ గుజరాత్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, 19న చివరి టీ20 ఢిల్లీలో షెడ్యూల్ చేసింది బీసీసీఐ. భారత వాతావరణ పరిస్థితులు, పిచ్, బౌలర్లపై సమగ్రమైన అవగాహన ఏర్పడటం వల్ల కలిసి వస్తుందని భావిస్తోంది దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్. ఐపీఎల్ వంటి ఫార్మట్లో ఆడుతున్నాననే బెరకు అతనిలో కనిపించలేదు. ఐపీఎల్ తొలి మ్యాచ్లోనే కోల్కత నైట్ రైడర్స్పై 19 బంతుల్లో 29 పరుగులు చేశాడు. స్వేచ్ఛగా షాట్లు ఆడాడు.
పంజాబ్ కింగ్స్పై జరిగిన మ్యాచ్లో విజృంభించాడు. 25 బంతుల్లో 49 పరుగులు చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్పైనా దూకుడుగా ఆడాడీ బేబీ ఏబీ. 13 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఐసీసీ అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్లో అద్భుతంగా రాణించాడు. టోర్నమెంట్ మొత్తానికి టాప్ స్కోరర్ అతనే. ఆరు ఇన్నింగ్స్లల్లో 506 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. రెండుసార్లు 90కి పైగా పరుగులు సాధించాడు. ఆ టాలెంట్ చూసే అతణ్ని జట్టులోకి తీసుకుంది ముంబై.