
90 శాతం పెరుగుదల..
దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,183 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,985 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 214 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 11,542గా నమోదైంది.
చెప్పుకోవడానికి 2,183 కొత్త కేసులే రికార్డయినప్పటికీ- పెరుగుదల తీవ్రతకు అది అద్దం పడుతోంది. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో కోవిడ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఆదివారం నాటితో పోల్చుకుంటే కొత్త కేసులు రెట్టింపు అయ్యాయి.

ఢిల్లీ కేపిటల్స్లో కలకలం..
ఈ పరిణామాలు- ఐపీఎల్ మ్యాచ్లపైనా పడే అవకాశాలు లేకపోలేదు. ప్రత్యేకించి ఢిల్లీ కేపిటల్స్ జట్టులో కోవిడ్ భయం ఆవరించింది. ఇప్పటికే జట్టు ఫిజియోథెరపిస్ట్ ప్యాట్రిక్ ఫర్హర్ట్ కోవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఐసొలేషన్లో ఉన్నారు. మరో ప్లేయర్కు కూడా కోవిడ్ సోకిందనే వార్తలు వెలువడుతున్నాయి. దీనితో జట్టు మొత్తం ప్రస్తుతం క్వారంటైన్లోకి వెళ్లింది. ఇవ్వాళ్టి తన షెడ్యూల్ మొత్తాన్ని రద్దు చేసుకుంది.

పుణే టూర్ క్యాన్సిల్..
ఆ ప్లేయర్ పేరు, ఇతర వివరాలు తెలియరావట్లేదు గానీ.. ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకున్నారని, దానికి సంబంధించిన రిజల్ట్ ఇంకా రావాల్సి ఉందని సమాచారం. షెడ్యూల్ ప్రకారం.. ఇవ్వాళ ఢిల్లీ కేపిటల్స్ టీమ్- పుణేకు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. ఐపీఎల్ 2022లో భాగంగా పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తన తదుపరి మ్యాచ్ను ఆడాల్సి ఉంది రిషభ్ పంత్ టీమ్. పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ఎల్లుండి ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది.

క్వారంటైన్లో ఢిల్లీ టీమ్..
దీనికోసం ఢిల్లీ కేపిటల్స్ టీమ సన్నద్ధం కావట్లేదు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిబంధనల ప్రకారం.. కనీసం మూడు రోజుల పాటు క్వారంటైన్ కాలాన్ని గడపాల్సి ఉన్నందున- ఆ మ్యాచ్ ఉంటుందా? లేదా అనే సందేహాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ పరిణామాలను బీసీసీఐ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది. ఢిల్లీ కేపిటల్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ నిర్వహించాలా? వద్దా అనే విషయంపై టెక్నికల్ కమిటీ తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది. ఈ కమిటీ సిఫారసుల మేరకే బీసీసీఐ తుది నిర్ణయాన్ని తీసుకుంటుంది.

రాణించట్లేని ఢిల్లీ..
ఈ సీజన్లో ఢిల్లీ కేపిటల్స్ ప్రయాణం ఆశించిన స్థాయిలో సాగట్లేదు. ఇప్పటివరకు అయిదు మ్యాచ్లను ఆడిన రిషభ్ పంత్ టీమ్.. రెండింట్లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచిందీ జట్లు. తొమ్మిది, 10 స్థానాల్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్ కలకలం రేపడం.. జట్టు ఆటగాళ్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీస్తుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications












