స్థిరంగా నాకు అవకాశాలు ఇవ్వడం వల్లే..
గుజరాత్ టైటాన్స్ జట్టులో స్థిరమైన ప్లేయర్గా కొనసాగుతున్న మిల్లర్ ఈ సీజన్లో స్థిరమైన అవకాశాలను పొందడంతో మంచిగా రాణించాడు. చాలా మ్యాచ్లలో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్ టైటాన్స్ మిడిలార్డర్ దుర్భేద్యంగా ఉండడానికి మిల్లర్ కూడా ఓ కారణమైంది. ఇక గతంలో రాజస్థాన్ రాయల్స్ తరపున 2020, 2021లో ఆడిన మిల్లర్కు ఆ ఫ్రాంచైజీ పెద్దగా అవకాశాలివ్వలేదు. 2020లో కేవలం 1 మ్యాచే ఆడించిన రాజస్థాన్, 2021లో 9 మ్యాచ్ లు ఆడించింది. ఇక ఆ టైంలో పేలవ ఫామ్ కనబర్చిన మిల్లర్ 10 మ్యాచ్లలో 124పరుగులు మాత్రమే చేశాడు.

గుజరాత్లో నాకంటూ సరైన ప్లేస్ ఉంది
ఇక మిల్లర్ తన ఆటతీరు గురించి మాట్లాడుతూ.. 'నేను ఇలా ఆడడానికి కారణం నాకు సరైన అవకాశాలు దక్కడం. నాకు ఓ స్థిరమైన ఆర్డర్లో బ్యాటింగ్ చేసే పాత్ర గుజరాత్ టీంలో దక్కింది. నాకు మొదటి నుండి టీం నుంచి మద్దతు లభించింది. నా వ్యక్తిగత ప్రదర్శనను, టీంలో నా పాత్రను ఆస్వాదిస్తున్నాను. ఇక ఐపీఎల్లో నేను చాలా సంవత్సరాలుగా ఆడుతున్నాను. ఇక్కడ ఎలా ఆడాలో తెలుసు. నా ఆటను మరింత మెరుగ్గా చేసుకుంటున్నాను.' అని మిల్లర్ స్టార్ స్పోర్ట్స్తో పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ వేడుకలో చెప్పాడు.

హోంగ్రౌండ్లో ఫైనల్ ఆడనున్న గుజరాత్
గుజరాత్ టైటాన్స్ జట్టులో 5వ స్థానంలో బ్యాటింగ్ దిగే మిల్లర్ నిన్నటి క్వాలిఫయర్ మ్యాచ్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (40*)తో కలిసి 106 పరుగుల నాల్గవ వికెట్ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అతను తన ఇన్నింగ్స్లో మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లు కొట్టాడు. రాయల్స్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ వేసిన చివరి ఓవర్లో ఆరు బంతుల్లో 16పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఆ ఓవర్లో స్ట్రైక్లో ఉన్న మిల్లర్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు. తద్వారా గుజరాత్ విజయం సాధించి ఫైనల్ బెర్త్ను బుక్ చేసుకుంది. మే 29న గుజరాత్ హోం గ్రౌండ్ అయిన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్లో గుజరాత్ క్వాలిఫయర్ 2విజేతతో తలపడనుంది.


Click it and Unblock the Notifications












