
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ చెన్నై సూపర్ కింగ్స్కు కలిసి రావట్లేదు. వరుస అపజయాలు వెంటాడుతున్నాయి. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానం నుంచి పైకి లేవలేకపోతోంది. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో గెలిచింది రెండంటే రెండు మాత్రమే. పంజాబ్ కింగ్స్పై ఆడిన చివరి మ్యాచ్లోనూ పరాజయాన్ని అందుకుంది. ఈ సీజన్లో ఇక చెన్నై టీమ్ ప్రస్థానం మరింత ముందుకు సాగే అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్టే. ప్లేఆఫ్స్ వరకు వెళ్లే ఛాన్స్లను వదలుకుంది.
వరుస ఓటములతో సతమతమౌతున్న చెన్నై సూపర్ కింగ్స్కు మరో బిగ్ బ్లో. మిడిల్ ఆర్డర్లో కొద్దో, గొప్పో రాణిస్తూ వస్తోన్న బ్యాటర్ అంబటి రాయుడు గాయపడ్డాడు. పంజాబ్ కింగ్స్పై మ్యాచ్ సమయానికే అతను గాయపడ్డాడు. చేతిపై గాయమైంది. ఆ గాయంతోనే బ్యాటింగ్ చేశాడు. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలోఅంబటి రాయుడు అద్భుతంగా ఆడిన విషయం తెలిసిందే. 39 బంతుల్లో 78 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి.

మొండిగా బ్యాటింగ్ చేయడం గాయాన్ని మరింత తీవ్రం చేసింది. చర్మంపై వాపు, పొక్కులతో అతను బాధపడుతున్నాడు. అది ఇప్పటికీ రాయుడిని వేధిస్తూనే ఉందని స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. ఇంకో నాలుగు రోజుల్లో చెన్నై సూపర్ కింగ్స్ తన తరువాతి మ్యాచ్ను ఆడాల్సి ఉంది. దూకుడు మీదున్న సన్రైజర్స్ హైదరాబాద్ను ఢీ కొట్టాల్సి ఉంది. ఇంకా నాలుగు రోజుల సమయం ఉన్నప్పటికీ అంబటి రాయుడు కోలుకునే అవకాశాలపై టీమ్ మేనేజ్మెంట్ నమ్మకంతో లేదు. కోలుకోలేకపోవచ్చనే భావిస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదుకుంటోన్నది అంబటి రాయుడే. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్లల్లో అతను 246 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 78. పంజాబ్ కింగ్స్పై దీన్ని సాధించాడు. బ్యాటింగ్ యావరేజ్ 35.14. 129.47 స్ట్రైక్ రేట్తో బౌలర్ల పని పడుతున్నాడు. ఫామ్లో ఉన్న సమయంలో గాయం వల్ల మ్యాచ్కు దూరం కావడం అతని బ్యాటింగ్ రిథమ్ను దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదు. అదే ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ను ఆందోళనకు గురి చేస్తోంది.