
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా ఈ సాయంత్రం మరో కీలక మ్యాచ్ జరుగనుంది. చెన్నై సూపర్ కింగ్స్- ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. రెండు జట్లకూ కీలకమైన మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్కు అగ్నిపరీక్షలాంటిది. గెలవక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోంది.
టోర్నమెంట్ కీలక దశకు చేరుకున్న సమయంలో విఫలమౌతోంది. వరుసగా మూడు మ్యాచ్లల్లో ఓటమి తరువాత చెన్నై సూపర్ కింగ్స్ను ఢీ కొట్టబోతోంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్లల్లో అయిదింట్లో ఆర్సీబీ ఓడింది. 10 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలనుకుంటే చెన్నైపై గెలవడం అత్యవసరం. దీనికోసం నెట్స్లో కఠోరంగా శ్రమిస్తోందీ టీమ్. ఈ హర్డిల్ను దాటుకోగలిగితే తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోగలుగుతుంది.

చెన్నై సూపర్ కింగ్స్పై ఓ అరుదైన రికార్డుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కేప్టెన్, బ్యాటర్ విరాట్ కోహ్లీ అతి చేరువగా ఉన్నాడు. కిందటి మ్యాచ్లో ఆడినట్టుగా పెర్ఫార్మ్ చేస్తే మాత్రం ఆ రికార్డ్ కోహ్లీ ఖాతాలో పడుతుంది. ఈ రికార్డును కొట్టడానికి ఇదే మంచి అవకాశం. ఇది మిస్ అయితే మాత్రం ప్లేఆఫ్స్లోనో, అదృష్టం బాగుంటే ఫైనల్స్లోనో అవకాశం ఉంటుంది. ప్లేఆఫ్స్కు చెన్నై సూపర్ కింగ్స్ చేరుకుంటుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో- ఆ రికార్డును అందుకోవాంటే ఇంకో ఏడాది పడుతుంది.
అదే- చెన్నై సూపర్ కింగ్స్పై 1,000 పరుగులు చేసిన ఘనత. 51 పరుగుల దూరంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఈ స్కోర్ చేయగలిగితే ఐపీఎల్ చరిత్రలో చెన్నైపై నాలుగంకెల పరుగులు చేసిన రికార్డును అందుకుంటాడు. లేదంటే మరో ఏడాదిపాటు ఎదురు చూడాల్సిన అవసరం తప్పకపోవచ్చు. వచ్చే సీజన్లోనే అది సాధ్యపడుతుంది. లీగ్ దశలోనే కొట్టేయడానికి విరాట్ కోహ్లీకి ఓ మంచి అవకాశం దక్కింది. దీన్ని అతను సాధిస్తాడా.. లేదా అనేది ఈ రాత్రికి తేలిపోతుంది.