
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా ఈ సాయంత్రం మరో కీలక మ్యాచ్ జరుగనుంది. చెన్నై సూపర్ కింగ్స్- ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. రెండు జట్లకూ కీలకమైన మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్కు అగ్నిపరీక్షలాంటిది. గెలవక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోంది.
టోర్నమెంట్ కీలక దశకు చేరుకున్న సమయంలో విఫలమౌతోంది. వరుసగా మూడు మ్యాచ్లల్లో ఓటమి తరువాత చెన్నై సూపర్ కింగ్స్ను ఢీ కొట్టబోతోంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్లల్లో అయిదింట్లో ఆర్సీబీ ఓడింది. 10 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలనుకుంటే చెన్నైపై గెలవడం అత్యవసరం. దీనికోసం నెట్స్లో కఠోరంగా శ్రమిస్తోందీ టీమ్. ఈ హర్డిల్ను దాటుకోగలిగితే తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోగలుగుతుంది.

నెట్ ప్రాక్టీస్ విరామంలో ఆర్సీబీ కేప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడాడు. ధోనీపై ప్రశంసల వర్షాన్ని కురిపించాడు. ధోనీ కేప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ విజయాలను సాధించడం వెనుక ఎలాంటి రహస్యం లేదని వ్యాఖ్యానించాడు. అతను ఉంటే చాలు జట్టు ఆటోమేటిక్గా విజయపథంలో నడుస్తుందని చెప్పాడు. తుది జట్టులో తనకు కావాల్సిన ప్లేయర్లను ఏరికోరి సెలెక్ట్ చేసుకుంటాడని, అక్కడే చెన్నై సగం విజయం సాధిస్తుందని పేర్కొన్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ సాధించే విజయాల్లో ఎంఎస్ ధోనీది కీలక పాత్రేననడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో అతను కీలక పాత్ర పోషిస్తున్నాడని, ధోనీ సారథ్యంలో సీఎస్కే బలంగా తయారైందనడానికి సన్రైజర్స్ హైదరాబాద్పై జరిగిన మ్యాచే ఉదాహరణ అని అన్నాడు. అలాంటి జట్టును తాము ఎదుర్కొనబోతున్నామని, దీనికోసం కఠినంగా శ్రమించక తప్పదని డుప్లెసిస్ స్పష్టం చేశాడు. చెన్నై దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి తమ వద్ద ప్రత్యేకంగా ప్లాన్స్ ఉన్నాయని పేర్కొన్నారు.