
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా ఈ సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్ తన తదుపరి మ్యాచ్ ఆడనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. రెండు జట్లకూ కీలకమైన మ్యాచ్ ఇది. ఈ రెండు వరుస పరాజయాలను చవి చూస్తోన్నాయి. ప్రత్యేకించి రాయల్ ఛాలెంజర్స్కు అగ్నిపరీక్షలాంటిది. గెలవక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోంది.
టోర్నమెంట్ కీలక దశకు చేరుకున్న సమయంలో విఫలమౌతోంది ఆర్సీబీ. వరుసగా మూడు మ్యాచ్లల్లో ఓటమి తరువాత చెన్నై సూపర్ కింగ్స్ను ఢీ కొట్టబోతోంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్లల్లో అయిదింట్లో ఆర్సీబీ ఓడింది. 10 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలనుకుంటే చెన్నైపై గెలవడం అత్యవసరం. ఈ హర్డిల్ను దాటుకోగలిగితే తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోగలుగుతుంది.
చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య బెట్ రక్తి కట్టిస్తోంది. చాలామంది చెన్నై వైపే మొగ్గు చూపుతున్నారు. కొందరు మాజీ క్రికెటర్లు సైతం ధోనీ సేనకే జైకొడుతున్నారు. గత రికార్డులు కూడా అవే సూచిస్తోన్నాయి. 2018 నుంచి ఇప్పటివరకు ఈ రెండు జట్లు తొమ్మిది సార్లు తలపడగా..ఏడుసార్లు చెన్నైకే విజయం వరించింది. రెండుసార్లు మాత్రమే రాయల్ ఛాలెంజర్స్ గెలిచింది. ఇవ్వాళ్టి మ్యాచ్ పదవది.
చెన్నై సూపర్ కింగ్స్కు మళ్లీ ధోనీ కేప్టెన్గా అపాయింట్ కావడం శుభసూచకమని లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు. టోర్నమెంట్లో ఎలా పుంజుకోవాలో..ఎలా ముందడుగు వేయాలో ఆ జట్టుకు కొట్టిన పిండేనని పేర్కొన్నారు. జట్టును మళ్లీ విజయాల బాటలో నడిపించే శక్తి సామర్థ్యాలు ధోనీకి ఉన్నాయని పేర్కొన్నారు. తన ప్రస్థానాన్ని ఇప్పటికే మొదలు పెట్టిందనీ అన్నారు.
యుపైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగిన గత సీజన్లో- మొదట్లో వరుసగా పరాజయాలను పొందిన కోల్కత నైట్రైడర్స్ ఎలా పుంజుకుని ఫైనల్స్కు చేరగలిగిందో- చెన్నై కూడా అలానే బౌన్స్ బ్యాక్ అవుతుందని చెప్పారు. స్వదేశీ గడ్డ మీద నైట్రైడర్స్ నిరాశ పరిచారని సునీల్ గవాస్కర్ అన్నారు. ఈ సీజన్లో అసలు సీన్లోనే లేకుండా పోయేలా ఉందని అభిప్రాయపడ్డారీ టీమిండియా మాజీ ప్లేయర్.