బెస్ట్ ఫినిషర్..
మహేంద్ర సింగ్ ధోనీ ఓ బెస్ట్ గేమ్ ఛేంజర్. అంతకుమించి అత్యుత్తమ ఫినిషర్. 2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో అతని ఫినిషింగ్ ఎలా ఉంటుందో..ప్రత్యర్థిపై చివరి పంచ్ ఎలా విసురుతాడో..అందరికీ తెలిసిపోయింది. ఇన్ని సంవత్సరాలయినప్పటికీ.. ఆ మార్క్ను తుడిచేయలేకపోయారు మరో బ్యాటర్. ఇప్పటికీ ధోనీని అత్యుత్తమ ఫినిషర్గానే భావిస్తారు. ఆ ఐడెంటిటీని ధోనీ నిలబెట్టుకున్నాడు. 40 సంవత్సరాల వయస్సు వచ్చినా.. క్రికెటింగ్ షాట్లల్లో ఎలాంటి తేడా లేదని నిరూపించుకున్నాడు.
ధోనీ మార్క్..
19వ ఓవర్ వరకు ముంబై ఇండియన్స్ చేతుల్లోనే కనిపించింది మ్యాచ్. చిట్టచివరి ఓవర్లో చెన్నై సూపర్ కింగ్స్ తలరాతను మార్చేశాడు ఫ్యాన్స్ డెమి గాడ్ ధోనీ. 6 బంతుల్లో 17 పరుగులు చేయాల్సిన దశ అది. క్రీజ్లో మహేంద్ర సింగ్ ధోనీ ఉండటంతో చెన్నై సూపర్ కింగ్స్ ఆశలు సడల్లేదు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ధోనీ వమ్ము చేయలేదు. ఆ ఓవర్ తొలి బంతికి వికెట్ పడగొట్టినప్పటికీ.. తొణకలేదు, బెణకలేదు. విజయానికి కావాల్సిన పరుగులను రాబట్టుకున్నాడు ధోనీ. అతణ్ని కట్టడి చేయలేకపోయాడు జయదేవ్ ఉనద్కత్. చివరి నాలుగు బంతుల్లో ధోనీ 6,4,2,4 పరుగులు సాధించడంతో ముంబై పరాజయం పరిపూర్ణమైంది.
ఫ్యాన్స్ ఫిదా..
ధోనీ ఇన్నింగ్కు అభిమానులు ఫిదా అయ్యారు. ఓడిపోయే మ్యాచ్ను ఒంటిచేత్తో లాక్కొచ్చాడంటూ కితాబులిస్తున్నారు. మ్యాచ్ చేస్తున్నంత సేపూ 2011 ప్రపంచకప్ ఫైనల్స్ను గుర్తుకు తెచ్చాడని చెబుతున్నారు. సీట్ ఎడ్జ్ మ్యాచ్ను చాలా రోజుల తరువాత చూశామని, ధోనీ ఫినిష్ చేసిన తీరు అతని పట్టుదలకు అద్దం పట్టిందంటూ ప్రశంసల వర్షాన్ని కురిపిస్తోన్నారు. ఆధునిక క్రికెట్లో అతణ్ని మించిన క్రికెటర్ మరొకరు ఉండబోరనీ అంటున్నారు.
మోకరిల్లిన జడేజా..
మ్యాచ్ ముగిసిన అనంతరం దర్జాగా పెవిలియన్ వైపు వస్తోన్న ధోనీకి కేప్టెన్ రవీంద్ర జడేజా అద్భుతంగా స్వాగతం పలికాడు. అతని ముందు మోకరిల్లాడు. సలాం చేశాడు. ధోనీ అనే అడ్డు లేకపోయి ఉంటే ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వశం అయ్యేదే అనడంలో సందేహాలు అక్కర్లేదు. అందుకే తన కృతజ్ఞతను దాచుకోలేకపోయాడు రవీంద్ర జడేజా. 20వ శతాబ్దంలో ధోనీ ఓ అత్యద్భుత క్రికెటర్ అంటూ నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న ప్రిటోరియస్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications
