
లక్నోపై భారీ స్కోరు చేసినా..
లక్నో సూపర్ జెయింట్స్పై 211 పరుగుల భారీ లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ఇంకా మూడు బంతులు మిగిలివుండగానే లక్నో బ్యాటర్లు 210 పరుగులను దాటేశారు. కేప్టెన్గా బాధ్యతలను స్వీకరించిన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా.. మరోసారి దారుణంగా విఫలం అయ్యాడు. బౌలర్గా చేతులెత్తేశాడు. రెండు ఓవర్లు మాత్రమే విసిరిన అతను ఏకంగా 21 పరుగులను సమర్పించుకున్నాడు. ఇన్నింగ్ మొత్తం మీద నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారు చెన్నై బౌలర్లు.

నీరసించిన బౌలింగ్ డిపార్ట్మెంట్..
ముఖేష్ చౌదరి, తుషార్ దేశ్పాండే, డ్వేన్ బ్రావో, మొయిన్ అలీ, శివమ్ దుబే ధారాళంగా పరుగులు ఇచ్చారు. రెండు వికెట్లను పడగొట్టిన డ్వేన్ ప్రిటోరియస్ ఉన్నంతలో ఫర్వాలేదనిపించుకున్నాడు. శివమ్ దుబే వేసిన ఒకే ఒక్క ఓవర్ జట్టుకు విజయాన్ని దూరం చేసింది. కీలకమైన 19వ ఓవర్లో 25 పరుగులు పిండుకున్నారు బ్యాటర్లు. రెండు ఎక్స్ట్రాలతో మొత్తంగా ఎనిమిది బంతులు విసిరాడా ఓవర్లో. ఈ ఓవర్- లక్నో బ్యాటర్ల మీద ఉన్న ఒత్తిడిని తుడిచిపెట్టేసింది.

ఆసుపత్రిలో అడ్మిట్..
ఈ పరిణామాల మధ్య చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్కు మరో పిడుగులాంటి వార్త అందింది. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా పేరున్న ఫాస్ట్ బౌలర్ క్రిస్ జోర్డాన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. టాన్సిల్ ఇన్ఫెక్షన్తో అతను బాధపడుతున్నాడు. ఈ ఇన్ఫెక్షన్ తీవ్రం కావడంతో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ముంబైలోని ఓ టాప్ కార్పొరేట్ ఆసుపత్రిలో క్రిస్ జోర్డాన్ చికిత్స పొందుతున్నాడు. మరో పేసర్ ఆడమ్ మిల్నె పరిస్థితీ ఇంతే. అతను కూడా గాయంతో సతమతమౌతున్నాడు. తరువారి మ్యాచ్కు అతను కూడా అందుబాటులో ఉండట్లేదు.

దీపక్ చాహర్ సైతం..
చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ తురుఫుముక్క దీపక్ చాహర్ సైతం గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ నెలాఖరు నాటికి దీపక్ చాహర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ముగ్గురూ ప్రధాన బౌలర్ల గైర్హాజరీలో చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ బ్యాకప్ను బరిలోకి దించాల్సి వస్తోంది. ముఖేష్ చౌదరి, తుషార్ దేశ్పాండే మీద ఆధారపడింది. వారిద్దరూ లక్నో సూపర్ జెయింట్స్పై పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయారు.

వరుసగా రెండో మ్యాచ్లో..
చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా తొలి రెండు మ్యాచ్లల్లో ఓటమిపాలు కావడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. ఇదివరకెప్పుడూ ఇలాంటి సందర్భాన్ని చవి చూడలేదు. ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిపోయి.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచిందీ టీమ్. తొలి మ్యాచ్లో కోల్కత నైట్ రైడర్స్ చేతిలో పరాభవాన్ని చవి చూసిన విషయం తెలిసిందే. తన తదుపరి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను ఎదుర్కొనబోతోంది. ఎల్లుండి సాయంత్రం 7:30 గంటలకు ముంబై బ్రబౌర్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది.


Click it and Unblock the Notifications












