
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్.. చెన్నై సూపర్ కింగ్స్కు చేదు జ్ఞాపకాలను మిగిల్చినట్టే. ఐపీఎల్ చరిత్రలో సెకెండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ జట్టుగా గుర్తింపు ఉన్న చెన్నై సూపర్ కింగ్స్- ఈ సీజన్లో ప్లేఆఫ్స్కు చేరే అవకాశాలు దాదాపుగా లేవు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగిన ఐపీఎల్ 2020 సీజన్ తరహాలోనే ఈ సారి కూడా నిరాశపరిచిందీ నాలుగుసార్లు ఛాంపియన్గా నిలిచిన జట్టు. ముంబై ఇండియన్స్ పరిస్థితీ ఇంతే.
ముంబై ఇండియన్స్తో పోల్చుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి కొంతలో కొంత బెటర్. 11 మ్యాచ్ల్లలో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగింట్లో విజయాలను అందుకోగా.. అదే 11 మ్యాచ్లను ఆడిన ముంబై ఇండియన్స్ గెలిచింది రెండే. ఈ రెండు టీమ్స్ ప్లేఆఫ్స్కు చేరుతాయనే ఆశల్లేవు. ప్రారంభంలో చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా కేప్టెన్సీలో కొన్ని మ్యాచ్లను ఆడిన విషయం తెలిసిందే. కేప్టెన్సీ మార్పు వ్యవహారమే ఆ జట్టు విజయావకాశాలను దెబ్బకొట్టిందనే అభిప్రాయాలు ఉన్నాయి.
కేప్టెన్సీ మళ్లీ మహేంద్ర సింగ్ ధోనీ చేతుల్లోకి వచ్చిన తరువాత కొంత సానుకూల ఫలితాలొచ్చాయి గానీ.. అప్పటికే పరిస్థితులు పూర్తిగా చేజారి పోయాయి. చేతులు పూర్తిగా కాలిన దశలో తన తప్పును గ్రహించింది చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ. జట్టు పగ్గాలను మళ్లీ ధోనీకే అప్పగించింది. ఆ తరువాత కూడా పెద్దగా మార్పులేమీ రాలేదు గానీ.. గెలిచిన మ్యాచ్ల సంఖ్యను స్వల్పంగా పెంచుకోగలిగింది చెన్నై సూపర్ కింగ్స్.
అటు రవీంద్ర జడేజా వ్యక్తిగత ఫామ్ను కూడా కోల్పోయాడు. బౌలింగ్లో పదును తగ్గింది. బ్యాటింగ్లో భారీ షాట్లను ఆడలేక ఒత్తిడికి గురయ్యాడు. కేప్టెన్సీ భారాన్ని అతను మోయలేకపోతున్నాడు. ఇక తాజాగా- ఐపీఎల్ మొత్తానికీ దూరం అయ్యే పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. గాయం వల్ల ఇప్పటికే రెండు మ్యాచ్లను అతను ఆడలేదు. డగౌట్కే పరిమితం అయ్యాడు. ఇక తాజాగా మిగిలిన మ్యాచ్లకు కూడా జడేజా దూరం కానున్నట్లు తెలుస్తోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో జడేజా గాయపడ్డ విషయం తెలిసిందే. ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో డైవ్ చేయగా.. ఛాతీపై గాయాలయ్యాయి. ఆ తరువాత ఢిల్లీ కేపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఆడలేదు. గురువారం ముంబై ఇండియన్స్తో మ్యాచ్కు కూడా రవీంద్ర జడేజా గైర్హాజర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మిగిలిన గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ల నుంచి కూడా తప్పుకుంటాడని అంటున్నారు.