
లక్నో చేతిలో రెండోసారి..
ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ తీరు ఏ మాత్రం మారలేదు. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో రెండోసారి పరాభవాన్ని చవి చూసింది. వాంఖెడె స్టేడియంలో జరిగిన మ్యాచ్లో లక్నో చేతిలో 36 పరుగుల తేడాతో ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 168 పరుగులు చేయగా..ముంబై ఇండియన్స్ దాన్ని కూడా ఛేదించలేక చేతులెత్తేసింది. 132 పరుగులకే చతికిలపడింది. రోహిత్ శర్మ-39, హైదరాబాదీ తిలక్ వర్మ-38, కీరన్ పొల్లార్డ్-19 పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ మరోసారి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. బేబీ ఏబీ డెవాల్డ్ బ్రెవిస్.. తనకు వచ్చిన అవకాశాలను ఏమాత్రం సద్వినియోగం చేసుకోవట్లేదు.

ఎనిమిదింట్లో..
మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా పేరున్న ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో వరుసగా ఎనిమిది మ్యాచ్లల్లో ఓడింది. కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ రెండుసార్లు ముంబైని మట్టికరిపించింది. ఢిల్లీ కేపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్కత నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్.. రోహిత్ శర్మ సేనపై జైత్రయాత్ర సాగించాయి. తన తదుపరి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ను ఢీకొట్టాల్సి ఉంది. శనివారం సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్లో గెలిచినా అది ఏ మాత్రం ఉపయోగపడకపోవచ్చు.

ప్లేఆఫ్ అవకాశాలు క్లోజ్..
ఈ సీజన్ల్ ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్కు చేరే అవకాశాలు ఏ మాత్రం లేవు. కొద్దో, గొప్పో ఉన్నాయనుకుంటే- అది 0.00038 శాతం మాత్రమే. తాను భారీ తేడాతో తోటి జట్లను ఓడించడమే కాకుండా.. తన ప్రత్యర్థులు కూడా అంతే భారీ తేడాతో ఓడిపోవాల్సి ఉంటుంది. ముంబై ఇండియన్స్ టీమ్ మొత్తం ఇప్పుడు ఆడుతున్న తీరు.. ప్లేయర్ల ఫామ్ చూస్తోంటే అది ఏ మాత్రం జరిగే పని కాదు. భారీ స్కోర్ సాధించడం కాదు కదా.. లక్నో సూపర్ కింగ్స్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది. ఈ స్కోర్తోనూ 36 పరుగుల తేడాతో ఓడింది.

ముంబై ఓటమితో..
ముంబై ఇండియన్స్ తాజాగా లక్నో సూపర్ జెయింట్స్తో ఓడిన విధానం.. అటు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలను కూడా దారుణంగా దెబ్బ తీసింది. ఇక ముందు ఆడే ఏడు మ్యాచ్లలోనూ చెన్నై సూపర్ కింగ్స్ గెలవాల్సిన పరిస్థితిని కల్పించింది ముంబై ఓటమి. 36 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ గెలవడం వల్ల ఆ జట్టు రన్రేట్ మెరుగుపడింది. చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా ఏడు మ్యాచ్లను ఆడాల్సి ఉంది. ఇదివరకు ఆరింట్లో గెలిచినా చెన్నైకి ప్లేఆఫ్స్ అవకాశాలు ఉండేవి. ముంబైపై లక్నో గెలవడం వల్ల ఇప్పుడవి మూసుకుపోయాయి. ఏడుకు ఏడూ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పంజాబ్పై ఇవ్వాళే..
పంజాబ్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ కేపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్తో ఆడాల్సి ఉంది. తన తదుపరి మ్యాచ్ను చెన్నై సూపర్ కింగ్స్ ఇవ్వాళే ఆడనుంది. పంజాబ్ కింగ్స్ను ఢీ కొట్టనుంది. ముంబైలోని వాంఖెడె స్టేడియంలో ఈ మ్యాచ్ ఈ సాయంత్రం 7:30 గంటలకు ఆరంభమౌతుంది. ఈ మ్యాచ్ సహా ప్రతి ఒక్కటీ గెలిస్తేనే చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ రేసులో నిల్చోగలుగుతుంది. గత సీజన్లో ఛాంపియన్గా నిలిచిన రవీంద్ర జడేజా సారథ్యంలోని ఎల్లో ఆర్మీ.. చివరికి ఇలా మనుగడ కోసం పోరాడాల్సి వస్తోంది.


Click it and Unblock the Notifications












