
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలపై హెడ్ కోచ్ మహేల జయవర్ధనె స్పందించారు. కేప్టెన్ రోహిత్ శర్మకు అండగా నిలిచారు. జట్టు కేప్టెన్గా రోహిత్ శర్మ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోన్నాడని, దీని నుంచి అతను గట్టెక్కుతాడని, ఆ విశ్వాసం తనకు ఉందని స్పష్టం చేశాడు. త్వరలోనే ఓ భారీ ఇన్నింగ్ను చూడగలుగతామని పేర్కొన్నాడు. గెలుపోటములు సర్వసాధరణమేనని, ఈ పరిస్థితి నుంచి త్వరలోనే పుంజుకుంటామని తేల్చి చెప్పారు.
రోహిత్ శర్మ అద్భుతమైన టైమింగ్ ఉన్న బ్యాటర్ అని జయవర్దనె అన్నారు. ఎక్కడా తడబడకుండా రోహిత్ శర్మ రాణిస్తున్నాడని, పూర్తి ఆత్మవిశ్వాసంతో బౌలర్లను ఎదుర్కొంటున్నాడని చెప్పారు. అతను భారీ స్కోర్ చేయలేకపోతున్నాడని అంగీకరించారు. దాని ఫలితం- జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించారు. 14-15 ఓవర్ల వరకు రోహిత్ శర్మ క్రీజ్లో ఉండాల్సిన అవసరం ఉందని, త్వరలోనే పాత కేప్టెన్ను తాము చూస్తామని అన్నారు.

తమ జట్టు ప్లేయర్లు బాగా ఆడుతున్నప్పటికీ.. వారి మధ్య భారీ భాగస్వామ్యం నెలకొనట్లేదని, ఆ ఒక్క ఇబ్బందిని తాము అధిగమించాల్సి ఉందని చెప్పారు. ఈ దిశగా కొత్త ప్రణాళికలను రూపొందించుకుంటున్నామని అన్నారు. పంజాబ్ కింగ్స్ ఓపెనింగ్ భాగస్వామ్యం ఆ జట్టు భారీ స్కోర్ చేయడానికి కారణమైందని జయవర్దనె వ్యాఖ్యానించారు. ప్రారంభ ఓవర్లల్లో బౌలర్లు ఓపెనర్లపై ఒత్తిడిని తీసుకుని రాలేకపోయారని చెప్పారు.
ఒక్క మ్యాచ్లో విజయం సాధించగలిగితే- జట్టులో ఆత్మవిశ్వాసం నిండుతుందని, తరువాతి తొమ్మిది మ్యాచ్లల్లో గెలవడానికి అవసరమైన సానుకూల దృక్పథం అలవడుతుందని పేర్కొన్నారు. తమ ప్రణాళికలన్నింటినీ మరోసారి సమీక్షించుకుంటామని, వాటిని అమలు చేయడంలో ఎక్కడ లోపాలు ఉన్నాయనేది తెలుసుకుంటామని మహేల చెప్పారు. కేప్టెన్ను తప్పు పట్టడానికి ఎక్కడా, ఎలాంటి అవకాశం లేదని, తన బాధ్యతలను రోహిత్ శర్మ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు.