సన్రైజర్స్ హైదరాబాద్ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్లో అరుదైన రికార్డును అందుకున్నాడు. ఆదివారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్లతో సత్తా చాటిన భువనేశ్వర్ ఐపీఎల్లో 150 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో 150 వికెట్లు పడగొట్టిన తొలి భారత పేస్ బౌలర్గా భువి రికార్డు సాధించాడు. మొత్తంగా ఈ ఫీట్ అందుకున్న ఆరో బౌలర్గా నిలిచాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 138 వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్ 7.32 ఎకానమీతో 150 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 5/19గా ఉన్నాయి.
ఐపీఎల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో చెన్నైసూపర్ కింగ్స్ ఆటగాడు డ్వేన్ బ్రావో మొదటి స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్లో బ్రావో ఇప్పటివరకు 177 వికెట్లు తీశాడు. బ్రావో తర్వాత రెండో స్థానంలో ముంబై ఇండియన్స్ బౌలర్ లసిత్ మలింగ్ ఉన్నాడు. మలింగ ఇప్పటివరకు 170 వికెట్లు తీశాడు. ఇక మూడో స్థానంలో భారత్కు చెందిన స్పిన్ బౌలర్ అమిత్ మిశ్రా ఉన్నాడు. మిశ్రా ఐపీఎల్లో 166 వికెట్లు తీశాడు. అలాగే ఐపీఎల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్ బౌలర్గా అమిత్ మిశ్రా నిలిచాడు. మొత్తంగా నాల్గో స్థానంలో 157 వికెట్లతో పీయూష్ చావ్లా, ఐదో స్థానంలో 151 వికెట్లతో యజుర్వేంద్ర చాహల్ ఉన్నారు.
ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే ఆల్రౌండ్ ప్రదర్శనంతో అదరగొట్టిన సన్రైజర్స్ హైదరాబాద్.. పంజాబ్ కింగ్స్పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బౌలింగ్లో సన్రైజర్స్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్ (3-22), ఉమ్రాన్ మాలిక్ (4-28) చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ 151 పరుగులకే ఆలౌటైంది. చివరి ఓవర్లో 3 వికెట్లు తీసిన ఉమ్రాన్ మాలిక్ మెయిడెన్ చేశాడు. పంజాబ్ బ్యాటర్లలో లివింగ్ స్టోన్(60) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం లక్ష్యాన్ని సన్రైజర్స్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. సన్రైజర్స్ బ్యాటర్లలో ఎయిడెన్ మాక్రమ్(41), నికోలస్ పూరన్(35), అభిషేక్ శర్మ రాణించారు.